Begin typing your search above and press return to search.

పాక్ కు లేటెస్ట్ షాకిచ్చిన శ్రీలంక!

By:  Tupaki Desk   |   30 Sep 2016 2:11 PM GMT
పాక్ కు లేటెస్ట్ షాకిచ్చిన శ్రీలంక!
X
పాక్ కు బ్యాడ్ టైం మొదలైనట్లే. నిలువెల్లా విషాన్ని పెట్టుకొని.. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న ఆ దేశం తీరుపై చుట్టుపక్కల దేశాలు ఎంత గుర్రుగా ఉన్నాయన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో సీరియస్ అయిన ప్రధాని మోడీ నోటి నుంచి ఒక కీలక మాట వచ్చింది. పాక్ ను ప్రపంచంలో ఏకాకిని చేస్తామని ఆయన ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. మోడీ నోటి నుంచి వచ్చిన మాటను పాక్ తో సహా పలువురు లైట్ తీసుకున్నారు. కానీ.. ఇలాంటి వ్యాఖ్యల్ని ఎంతో ముందుచూపుతో మోడీ చేసిన విషయం ఇప్పుడిప్పుడే అందరికి అర్థమయ్యే పరిస్థితి.

ఉరీలో సైనికుల ప్రాణాలు తీసినందుకు భారీమూల్యం చెల్లించుకోక తప్పదని.. భారత్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదని.. దెబ్బకు దెబ్బ తప్పదంటూ తీవ్రస్వరంతో మోడీ చేసిన వార్నింగ్ ప్రభావం ఎంతలా ఉంటుందన్నది పాక్ తో పాటు ప్రపంచానికి తెలిసే పరిస్థితి. నవంబరు 9.. 10 తేదీల్లో ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ దేశాల సదస్సుకు భారత్ హాజరు కానని తేల్చి చెప్పిన వేళ.. భారత్ బాటలోనే పలు దేశాలు నడుస్తూ.. తాము కూడా రాలేమని చెప్పటం తెలిసిందే.

ఎనిమిది సభ్య దేశాలున్న సార్క్ కూటమిలో.. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో ఇస్లామాబాద్ లో జరిగే సదస్సుకు హాజరయ్యేది లేదని భారత్ తేల్చి చెప్పగా.. భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్.. ఆ తర్వాత భూటాన్ సైతం సదస్సుకు రాలేమని తేల్చి చెప్పాయి. ఇంతకాలం మౌనంగా ఉన్న శ్రీలంక సైతం తాము సైతం సదస్సుకు హాజరు కాలేమని చెప్పేసింది. కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయినప్పటికీ.. లంక నో చెప్పిన టైం పాక్ స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసేదిగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. సార్క్ దేశాలకు నేతృత్వం వహిస్తున్న నేపాల్ సదస్సును రద్దు చేసే దిశగా ఆలోచిస్తోంది.

ఇక.. మాల్దీవుల నుంచి కూడా భారత్ కు సానుకూల సందేశమే వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. యూరీ ఘటన నేపథ్యంలో భారత్ కు అండగా పలు దేశాలు నిలుస్తుంటే.. పాక్ కు రోజు రోజుకు ఒంటరి అయిపోతున్న పరిస్థితి. శ్రీలంక ఇచ్చిన తాజా షాక్ .. ఆ దేశ స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనటంలో సందేహం లేదన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/