Begin typing your search above and press return to search.

కత్తి అంటే..ఎందుకు అంత గగ్గోలు బాబు

By:  Tupaki Desk   |   22 Jan 2019 10:30 AM GMT
కత్తి అంటే..ఎందుకు అంత గగ్గోలు బాబు
X
వైసీపీ నేత జగన్ పై కోడి కత్తితో దాడి జరిగినప్పుడు హేళన చేసిన మాట్లాడిన చంద్రబాబు నేడు ఎన్ ఐఏ విచారణ వద్దని ఎందుకు గగ్గోలు పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యీ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శల వర్షం కురిపించారు.

దేశంలోని అగ్రవర్ణాల పేదలకు కేంద్రం పది శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే చంద్రబాబు పరిపక్వత లేని నిర్ణయంతో సమాజంలోని రెండు వర్గాల మధ్య దూరం పెంచుతున్నాని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్లను ఏపీలో రాజకీయం చేస్తున్నారన్నారు. కాపులకు ఐదు శాతం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థలో సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని - అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతోందని సోము వీర్రాజు - కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సర్వశిక్ష అభియాన్ కింద కస్తూర్బా విద్యాలయం కేంద్రానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. మోరంపూడిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి - హార్టికల్చర్ సబ్ సెంటర్లకు కేంద్రమే నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలపై మంత్రి అయ్యన్న పాత్రుడే స్వయంగా చెప్పారని - రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన సహాయంపై మంత్రి మాటల కన్నా ఇంకేం ఆధారం కావాలని అన్నారు.

అధికార దాహంతోనే చంద్రబాబు అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లను రాజకీయం చేస్తున్నారని కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇందులో భాగంగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు - అగ్రవర్ణాల్లోని ఇతర కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో మాలమాదిగల మధ్య - మొన్నటికి మొన్న బీసీలు - కాపుల మధ్య గొడవ పెట్టారని గుర్తు చేశారు. బాబు మోసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని తాను ఎవరికీ లేఖ రాయలేదన్నారు. శాంతి భద్రతలపై మాత్రమే హోం మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు.