Begin typing your search above and press return to search.

యూట‌ర్న్ బాబు.నాలుగేళ్ల మౌనం మ‌ర్మం ఏంటో?

By:  Tupaki Desk   |   26 April 2018 4:08 AM GMT
యూట‌ర్న్ బాబు.నాలుగేళ్ల మౌనం మ‌ర్మం ఏంటో?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌ను చేసిన వ్యాఖ్యల ఆధారంగా త‌నే ఇబ్బందుల‌ను కొనితెచ్చుకుంటున్నార‌ని అంటున్నారు. విప‌క్షాల‌కు ఆయ‌నే అస్త్రం అందిస్తున్నార‌నే పార్టీ శ్రేణుల ఆందోళ‌న‌ల‌ను నిజం చేస్తూ తాజాగా బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజ‌పీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోమారు మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలంటూ హ‌ఠాత్తుగా బాబు గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వీర్రాజు సెటైర్లు వేశారు. నాలుగేళ్లుగా గవర్నర్‌ ను ఏమీ అనని ఏపీ సీఎం చంద్రబాబనాయుడు.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఆయ‌న‌ ప్రశ్నించారు. గవర్నర్‌ విషయంలో చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేస్తున్న చిత్ర‌మైన వ్యాఖ్య‌ల‌ను - రాజ‌కీయ అవ‌స‌రాల కోసం చేస్తున్న కామెంట్ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. నిన్నమొన్నటి వరకు గవర్నర్‌పై చంద్రబాబు పొగడ్తలు కురిపించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. `రాజ్యంగ పదవి అన్న ధ్యాస మర్చిపోయి గవర్నర్‌ ను ముఖ్యమంత్రి అవహేళన చేయడం ఎంతవరకు సబబు? నరసింహన్‌పై చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక కారణాలేంటి? ఏమైనా భారీ గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ చేస్తున్నారా?’’ అని సోము వీర్రాజు ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి .. కేంద్రం నుంచి తనను రక్షించాలనడం విచిత్రంగా ఉందన్నారు. ముఖ్యమంత్రే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే.. ప్రజలను ఎవరు కాపాడతారని అన్నారు. బాబు కామెంట్ల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి అవహేళన చేస్తున్నారని, రాజకీయాల్లో ఎన్నో ఉంటాయని, కానీ ప్రతి విషయంలో చంద్రబాబు ప్రజలను ఎందుకు ఇన్వాల్ చేస్తున్నారని వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో మీరు సొంతంగా చేసింది ఏముందో ఒక్కసారి ఆలోచించండన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా కారణంగా ఎవరు పడితే వారు ఇసుక అమ్మేసుకుంటున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ నాయకుడు - ప్ర‌ధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను ధగ్థం చేస్తుంటే త‌మ మీద కేసులు పెట్టడం అవివేకమన్నారు

ఇదిలాఉండ‌గా...ఏపీ సిఎం చంద్రబాబు పై అలిపిరి ఘటన రిపీట్ అవుతుంది అనే వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా సాక్షిగా వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అలిపిరి ఘటన చూపి సానుభూతి పొంది విజయం సాధించలేకపోయారని, అలాగే 2019 సంవత్సరం లో కూడా ప్రత్యేక హోదా చూపి సానుభూతి పొంది విజయం సాధించాలని అనుకుంటున్నారని, 2004 లో ఎలాంటి ఫలితాలు వచ్చయో 2019 లో కూడా అవే ఫలితాలు వస్తాయని మాత్రమే తాను అన్నానని ఆయన వివరణ ఇచ్చారు.