Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ...అన్నింటికీ జ‌వాబు

By:  Tupaki Desk   |   17 Dec 2018 3:27 PM GMT
ఏపీకి మోడీ...అన్నింటికీ జ‌వాబు
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో తీవ్ర నిరాశాజ‌న‌కమైన ఫ‌లితాలు రుచి చూసిన బీజేపీ ఇప్పుడు రాబోయే ఎన్నిక‌ల‌కు వేగంగా సన్న‌ద్ధం అవుతోంది. తాజాగా, ఆంధ్రప్ర‌దేశ్‌పై బీజేపీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన విష‌యంలో మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. భారత ప్రధాని నరేంద్రమోడీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. జనవరిలో ఏపీకి రానున్న మోడీ రెండు భారీ బహిరంగసభల్లో పాల్గొనే విధంగా ఏపీ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. జనవరి 6వ తేదీన తొలి సభ, అదే నెలలలో చివరి వారంలో రెండో సభ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని ఏపీకి వస్తుండడంతో అందరి ఫోకస్ ఆయన పర్యటనపైనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయన ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు స‌న్నాహాలు చేస్తున్నాయి. జనవరి 6న జరిగే తొలి సభను గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ ఎదుట బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు 5 లక్షల మందికి పైగా జన సమీకరణ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక నరేంద్ర మోడీ రెండో సభాస్థలిపై రేపు గుంటూరులో జరిగే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా, బీజేపీ నేత‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీపై ఏపీలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రధాని మోడీయే సమాధానం చెబుతారని అన్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీచేసుందని తెలిపారు. ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తామని వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వబోమని బీజేపీ ఎన్నడూ చెప్పలేదన్నారు. రాజకీయాలు మాట్లాడే మంత్రి యనమల రామకృష్ణుడు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఏడు లక్షల ఇళ్లు మంజూరు చేస్తే లక్షా 40 వేల ఇళ్లు మాత్రమే ఎందుకు పూర్తయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్‌కు 65 సీట్లే రావాల్సి ఉండగా.. చంద్రబాబు హడావిడి వల్ల 88 సీట్లు వచ్చాయన్నారు.