Begin typing your search above and press return to search.

వీర్రాజు క్లారిటీ : ఏపీకి హోదా రానేరాదు

By:  Tupaki Desk   |   31 May 2016 5:23 AM GMT
వీర్రాజు క్లారిటీ : ఏపీకి హోదా రానేరాదు
X
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోమారు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై త‌న‌దైన శైలిలో కామెంట్ చేశారు. అయితే ఈ ద‌ఫా మ‌రింత స్ప‌ష్టత ఇచ్చేస్తూ ఏపీకి ప్ర‌త్యేక హోదా రాద‌న్నారు. అస‌లు హోదా వ‌ల్ల ఏ ప్ర‌యోజ‌నం లేద‌ని చెప్పేశారు. దానికి త‌గిన లెక్క‌ల్ని కూడా ఆయ‌న ఇచ్చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వడం వలన ఏమాత్రం ప్రయోజనం లేదని, హోదా కంటే రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో నిధుల మంజూరుపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏడాదికి రూ.700 కోట్ల వంతున పదేళ్లకు రూ.7000 కోట్లు మంజూరవుతాయన్నారు. హోదా లేని పక్షంలో పదేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.4 లక్షల కోట్లు కేంద్రం నుండి రాష్ట్రానికి అందుతాయన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినా రాష్ట్రానికి ఉపయోగం ఉండదని, ఇప్పటికే రాష్ట్రానికి రూ.20వేల కోట్లు కేంద్ర ఉపరితల రవాణా - జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్క‌రీ మంజూరు చేశారన్నారు. అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. దేశంలో ఎక్కువ జిడిపి ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్‌ కే ఉందని వీర్రాజు అన్నారు. ఆ విధంగా చూసినా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా దక్కదన్నారు. హోదా సాధించిన రాష్ట్రాలు అభివృద్ధిలో 20 స్థానం దిగువకు పడిపోయాయన్నారు. జూన్ 4న రాష్ట్రంలో 7 చోట్ల, దేశంలో 200 నగరాల్లో వికాస పర్వ్ పేరుతో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వీర్రాజు తెలిపారు.