Begin typing your search above and press return to search.

సోమిరెడ్డి లాజిక్ నిజమైతే జగన్ పని అంతే..

By:  Tupaki Desk   |   27 Nov 2015 12:30 PM GMT
సోమిరెడ్డి లాజిక్ నిజమైతే జగన్ పని అంతే..
X
దేశంలో కొత్తగా పుట్టిన ప్రాంతీయ పార్టీలు తాము ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో గెలిచి అధికారం సాధిస్తేనే మనుగడ సాధించాయని... అలా గెలవలేని పార్టీలన్నీ గంగలో కలిసిపోయాయని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో అయిదో స్థానంలో నిలిచిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ లోనూ అదే స్థాయిలో పతనమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. తొలి ప్రయత్నంలో అధికారంలోకి రాని ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదని ఆయన అంటున్నారు. పనిలోపనిగా ఆయన జగన్ పైనా విరుచుకుపడ్డారు.

ప్రజలను రెచ్చగొట్టేలా నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన సాగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయులుగా ఉండేవారిని టీడీపీలోకి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

అయితే... తెలంగాణలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీఆరెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో తొలి ప్రయత్నంలో అధికారంలోకి రాలేదని... అయినా... పన్నెండేళ్లు పోరాడి నిలిచి గెలిచిందని కొందరంటున్నారు. సోమిరెడ్డి టీఆరెస్ ను మర్చిపోయి ఈ సూత్రం చెప్పారా లేదంటే కొత్త రాష్ట్రం నుంచి లెక్క మొదలుపెట్టారా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా జగన్ కు అధికారం దక్కదన్న సోమిరెడ్డి జ్యోష్యం విని చంద్రబాబు మాత్రం లోలోన ఆనందపడుతున్నారట.