Begin typing your search above and press return to search.

చనిపోయిన అనుచరుడి కోసం స్మృతి సాహసం

By:  Tupaki Desk   |   27 May 2019 5:15 AM GMT
చనిపోయిన అనుచరుడి కోసం స్మృతి సాహసం
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన లీడర్ ఆమె.. ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రధాన అనుచరుడు ఆయన.. స్మృతీ ఇరానీ గెలుపును సెలెబ్రేట్ చేసుకున్న పాపానికి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వచ్చి చంపేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఓటమికి కీలక భూమిక పోషించాడనే ఈ హత్య జరిగిందని బీజేపీ శ్రేణులు, ఆ గ్రామస్థులు ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమేఠీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పోటీచేశారు. ఆయనపై బీజేపీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పోటీచేశారు. ఆమె గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని బరౌలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ (50) తీవ్రంగా కృషి చేశారు. రాహుల్ ఓడిపోయాక సంబరాలు చేశారు. స్మృతీ గెలుపు కోసం తన ఊరి వాళ్లందరికీ బూట్లు కూడా ఈయన పంచిపెట్టాడట.. కానీ ప్రత్యర్థులు ఈయన్ను గత రాత్రి చంపేశారు. ఈ ఘటనకు రాజకీయ పరమైన స్పర్థలు కారణం అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యూపీ డిప్యూటీ సీఎం, మంత్రులు, పోలీసులు నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

అయితే తన ప్రధాన అనచరుడి మరణ వార్తతో ఎంపీ స్మృతీ ఇరానీ కదిలిపోయారు. ఏకంగా ఢిల్లీ నుంచి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం స్వయంగా సురేంద్రసింగ్ పాడే మోసి కన్నీళ్లతో నివాళులర్పించారు. ఇలా సొంత కార్యకర్త చనిపోతే స్మృతీ రావడం.. కుటుంబానికి అండగా నిలవడం.. పాడే కూడా మోయడం చూసి గ్రామస్థులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. బీజేపీ ఆ కుటుంబానికి న్యాయం చేస్తుందని స్మృతీ ధైర్యం చెప్పారు.