Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం: కొత్త మ‌తానికి క‌ర్ణాట‌క అంగీకారం

By:  Tupaki Desk   |   19 March 2018 1:25 PM GMT
సంచ‌ల‌నం: కొత్త మ‌తానికి క‌ర్ణాట‌క అంగీకారం
X
క‌ర్ణాట‌కలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముందే...ఆ రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. ఎన్నికల ముందు కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్‌ ల ఓట్లను కొల్లగొట్టే దిశగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. లింగాయత్‌ ను ప్రత్యేక మతంగా గుర్తించడానికి కర్ణాటక కేబినెట్ అంగీకరించింది. ఈ మేరకు సిఫారసును కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.అయితే ఆరెస్సెస్ ఇప్పటికే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది హిందూ మతాన్ని చీల్చే చర్యే అవుతుందని ఆరెస్సెస్ స్పష్టంచేసింది.

లింగాయత్‌ లకు ప్రత్యేక మతం హోదా ఇవ్వాలన్న జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసును కేబినెట్ ఆమోదించింది. ఇక ఇప్పుడు కేంద్రమే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నీట వనరుల మంత్రి, లింగాయత్ నేత ఎంబీ పాటిల్ అన్నారు. `లింగాయత్‌లు హిందువులు కాదని ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఇప్పుడు మా డిమాండ్ ఓ తార్కిక ముగింపు దిశగా అడుగు వేసింది. కేంద్రం కూడా దీనిని ఆమోదిస్తుందని భావిస్తున్నాం` అని పాటిల్ చెప్పారు. లింగాయత్‌ల ఓట్లను ఆకర్షించే చర్య ఇదని, కాంగ్రెస్ సమాజాన్ని చీల్చుతున్నదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ విమర్శించారు.

లింగాయత్‌ లు 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వరుని అనుచరులు. కర్ణాటకలో బీజేపీకి లింగాయత్‌ల మద్దతు పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో బీజేపీ చిక్కుల్లో పడింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కూడా ఓ లింగాయతే. వద్దని చెబితే 18 శాతం జనాభాగా ఉన్న లింగాయత్‌ల మద్దతు కోల్పోతాం.. ఓకే అని చెబితే ఆరెస్సెస్‌కు నచ్చదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని యడ్యూరప్ప సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మతాన్ని లింగాయత్‌గా పిలవాలని కొందరు, వీరశైవ లింగాయత్‌గా పిలవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. నిపుణుల కమిటీ మాత్రం లింగాయత్‌గా పిలవాలని సిఫారసు చేసింది.