Begin typing your search above and press return to search.

సిద్ధరామయ్య కొత్త పార్టీ?

By:  Tupaki Desk   |   11 July 2019 4:26 PM GMT
సిద్ధరామయ్య కొత్త పార్టీ?
X
కాంగ్రెస్‌ లో సిద్ధరామయ్య సీఎం అవకాశం కల్పించకుండా.. సొంత పార్టీ నాయకులే అడ్డుపడుతున్నారు. ఈక్రమంలో అధికారం బీజేపీ చేతుల్లో పెట్టి.. కాంగ్రెస్‌ ను వీడి సొంత పార్టీ పెట్టాలనే యోచనలో సిద్ధరామయ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు తోడుగా పలువురు సీనియర్‌ నాయకులు ఉన్నారు. రామలింగారెడ్డి - మునిరత్న - భైరతి బసవరాజు - ఎంటీబీ నాగరాజుతో పాటు సుమారు 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్‌ ను పూర్తిగా దెబ్బ తీసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ సిద్ధరామయ్య బలాన్ని గమనించి సీఎం పదవి కట్టబెట్టేందుకు ఒప్పుకుంటే కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులు చేసేదేమీ లేదు.

సీఎల్పీ నేత - కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సమన్వయ సమితి చైర్మన్‌ సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం కుమారస్వామి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అసంతృప్త ఎమ్మెల్యేల నిర్ణయంపై సిద్ధరామయ్య సీఎం పదవి ఆధారపడింది. కాంగ్రెస్‌ నుంచి రాజీనామా చేసిన అసంతృప్త ఎమ్మెల్యేల్లో చాలామంది సిద్ధు అనుచరులు ఉన్నారు. సిద్దూకు సీఎం పదవి కట్టబెడితే వారందరు రాజీనామాను ఉపసంహరించుకుంటారని సమాచారం. అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు డీకే శివకుమార్ - పరమేశ్వర్‌ సుముఖంగా లేరని తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన రోజు చేసుకున్న ఒప్పందం ప్రకారం కుమారస్వామికే ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగే అవకాశం ఇవ్వాలని పరమేశ్వర్, డీకే శివకుమార్‌ వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మధ్య కొట్లాటను పసిగట్టిన ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కుమారస్వామి సీఎంగా కొనసాగితే అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతుంది. నిత్యం ప్రభుత్వ మనుగడ కోసమే యత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీకి అధికారం కట్టబెట్టకుండా ఉండాలంటే జేడీఎస్‌ కు కీలక పదవులు ఇవ్వాలి. ఇందులో భాగంగా ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్న హెచ్‌డీ రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే మాజీ ప్రధాని - జేడీఎస్‌ జాతీయ నేత హెచ్‌ డీ దేవెగౌడ అనుమతి అవసరం కానుంది.

మాజీ సీఎం సిద్ధరామయ్య పక్కా ప్రణాళిక ప్రకారమే రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో మంత్రి డీకే శివకుమార్‌ అసంతృప్తులను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడాలని చెబుతున్న సిద్ధరామయ్య మాత్రం తనదైన శైలిలో కుమారస్వామికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్‌ లోనే సిద్ధరామయ్యకు శత్రువులు ఏర్పడ్డారు. సిద్ధూకు సీఎం పదవి ఇవ్వడంపై మంత్రి డీకే - మాజీ ఎంపీ మల్లికార్జునఖర్గే - డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ కు ఇష్టం లేదు. దీంతో సిద్ధరామయ్య మాత్రం తన అనుచరులతో రాజీనామాలు చేయిస్తూనే ఉన్నారు