Begin typing your search above and press return to search.

జీవీఎల్ పై చెప్పు ప‌డింది!

By:  Tupaki Desk   |   18 April 2019 11:33 AM GMT
జీవీఎల్ పై చెప్పు ప‌డింది!
X
తెలుగు ప్రాంతానికి చెందిన బీజేపీ నేత‌గా.. ప్ర‌త్య‌ర్థుల‌పై అదే ప‌నిగా నిప్పులు కురిపించే క‌మ‌ల‌నాథుడిగా సుప‌రిచితుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావుకు చేదు అనుభ‌వం ఎదురైంది. ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ప‌లుకుబ‌డి లేకున్నా.. పార్టీలోనూ.. మోడీషాల మ‌న‌సుల్లో చోటు సాధించిన ఆయ‌న ఏపీ ప్ర‌త్యేక హోదా మీద ఎన్నిసార్లు ఎన్ని ర‌కాలుగా మాట్లాడింది తెలిసిందే. అదే ప‌నిగా నోరు పారేసుకునే జీవీఎల్ కు ఊహించ‌ని రీతిలో షాక్ త‌గిలింది.

ఢిల్లీలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో ఆయ‌న ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. మీడియాతో మాట్లాడుతుండ‌గా.. ఆయ‌న‌పైకి చెప్పు ఒక‌టి దూసుకొచ్చింది. దీంతో ఆయ‌న షాక్ కు గుర‌య్యారు. చెప్పు విసిరిన వ్య‌క్తిని బీజేపీ వ‌ర్గాలు బ‌య‌ట‌కు పంపాయి.

భోపాల్‌ అభ్యర్థిగా భాజపా తరఫున ప్రజ్ఞాసింగ్‌ ను ప్రకటించిన అనంత‌రం కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల్ని ఖండించేందుకు జీవీఎల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తున్న ఆయ‌న‌పై కాన్పూరుకు చెందిన డాక్ట‌ర్ శ‌క్తి భార్గ‌వ్ చెప్పు విసిరారు. అది గురి త‌ప్ప‌కుండా జీవీఎల్ పైకి దూసుకెళ్లింది. ఈ త‌ర‌హా దాడుల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని చెప్పారు.

త‌న‌పై కాంగ్రెస్ నేత‌లే ఇలాంటి దాడులు చేయిస్తున్న‌ట్లుగా ఆరోపించారు. చెప్పు వేసిన వ్య‌క్తిపై బీజేపీ కార్యాల‌య సిబ్బంది తీవ్ర‌స్థాయిలో దాడి చేయ‌టం గ‌మ‌నార్హం. అయితే.. జీవీఎల్ పై చెప్పు విస‌రటానికి కార‌ణం ఏమిటి? అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. చెప్పు విసిరి త‌ప్పు చేశాడు స‌రే.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అలా చిత‌క్కొట్టటం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? త‌ప్పు చేసిన వారిని పోలీసుల‌కు అప్ప‌జెప్పాల్సిందిపోయి.. ఇలా కొట్టేయ‌ట‌మా?