Begin typing your search above and press return to search.

బాబు పాల‌న‌కు వ్య‌తిరేకంగా టీడీపీ ఎంపీ ధ‌ర్నా

By:  Tupaki Desk   |   25 March 2017 4:25 PM GMT
బాబు పాల‌న‌కు వ్య‌తిరేకంగా టీడీపీ ఎంపీ ధ‌ర్నా
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఏకంగా అధికారిక పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు నిర‌స‌న తెలిపారు. రోడ్డెక్కి ధ‌ర్నా నిర్వ‌హించారు. అనంత‌రం అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే త‌ను కోరిన స‌మాచారం రాలేదంటూ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇలా నిర‌స‌న తెలిపింది విజ‌య‌వాడ‌ టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రైవేటు బస్సులకు ర‌వాణాశాఖ అడ్డగోలుగా అనుమతులిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఆర్టీఏ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ముడుపులకు ఆశపడి ఆర్టీయే అధికారులు ఇష్టారాజ్యంగా ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు పెద్ద ఎత్తున అవినీతితో త‌మ వ్యాపారాల‌కు ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని వాపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ ఎపిసోడ్ క‌ల‌క‌లం రేకెత్తించ‌డంతో ఎంపీ కేశినేని నాని స‌హా ఇత‌ర‌, ప్రజాప్రతినిధులతో రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం చర్చలు జరిపారు. అయితే చ‌ర్చ‌ల అనంత‌రం త‌మ భేటీ విఫ‌ల‌మైంద‌ని ఎంపీ కేశినేని నాని ప్ర‌క‌టించారు. ప్రైవేట్‌ బస్సులకు అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతోంద‌నే త‌న నిర్దిష్ట వ్యాఖ్య‌ల‌కు సరైన సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తాను విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. అక్ర‌మ‌ ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకునే వ‌ర‌కు త‌న పోరాటం కొన‌సాగిస్తాన‌ని తెలిపారు.

ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా అధికార పార్టీ రోడ్డెక్క‌డం, అంతేకాకుండా ఆర్టీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాక్షాత్తు ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇలా కేశినేని బైఠాయించ‌డంపై టీడీపీ నేత‌ల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/