Begin typing your search above and press return to search.

నో ప్ర‌త్యేకం: మోడీవి గుజ‌రాత్ తెలివితేట‌లు

By:  Tupaki Desk   |   31 July 2015 1:44 PM GMT
నో ప్ర‌త్యేకం: మోడీవి గుజ‌రాత్ తెలివితేట‌లు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ఏ ఇత‌ర రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా క‌ల్పించే అవ‌కాశం లేద‌న్న‌కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు, పలువురు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభిమానులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మోదీ గుజరాత్ తెలివితేటలు ఆంధ్రలో చూపిస్తున్నారని సినీ హీరో శివాజీ మండిప‌డ్డారు. ప్రధానికి ఆంధ్ర ప్రజల ఉసురు తప్పక తగులుతుందని వ్యాఖ్యానించారు. ఓటుకునోటులో దొరికిపోవడం మూలంగా చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారని, జగన్ తన కేసులకు భయపడి కేంద్రాన్ని నిందించడం లేదని శివాజీ విమర్శించారు. ఏపీ ఎంపీలు సిగ్గులేని దద్దమ్మలని మండిప‌డ్డారు.

కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఏపీ టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామా చేసి మోడీ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్థసారథి డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ కలిసి చీకట్లో ఏపీని విభజించాయని, ప్ర‌స్తుత స్టేట్‌ మెంట్‌తో మరింత చీకట్లోకి నెట్టేశారని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో స్పెషట్ స్టేటస్ సాధిస్తామని చెబుతూ వచ్చిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని పార్థసారథి నిలదీశారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల మీద సీఎం చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం ప్రాధాన్యత ఉన్నా.. ఈ పాటికే కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేసి ఉండేవారన్నారు. ప్ర‌త్యేక హోదా నెల రోజుల్లో వస్తుందన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ ప్రజలకు ఇప్పుడేం జవాబిస్తారని ఆయన ప్రశ్నించారు.

ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ లో పోరాడాలని మాల మ‌హానాడు నేత కారెం శివాజీ సూచించారు. పక్క రాష్ట్రాలను సాకుగా చూపి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తోందని శివాజి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆగష్టు 5న ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.