Begin typing your search above and press return to search.

ప్రధాని హత్య.. ఓ సానుభూతి స్టోరీ..

By:  Tupaki Desk   |   12 Jun 2018 11:18 AM GMT
ప్రధాని హత్య.. ఓ సానుభూతి స్టోరీ..
X
సెంటిమెంట్ కు కన్నీళ్లు రాలుతాయని మనకు ఇన్నాళ్లు తెలుసు. కానీ ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీ ఓట్లు కూడా రాలుతాయని నిరూపించారు. తాజాగా మోడీ.. తన హత్యకు కుట్ర జరిగిందన్న ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేసుకొని కావాల్సినంత సానుభూతిని పొందారు. కానీ దీనివెనుక పెద్ద కథే ఉన్నదని తాజా సమాచారం.

మోడీ గద్దెనెక్కాక మావోయిస్టుల ఏరివేత శరవేగంగా సాగుతోంది. బీజేపీ పాలిస్తున్న చత్తీస్ ఘడ్ లోనైతే పదులు - ఇరవై - ముప్పై మంది మావోయిస్టులను ఒకేసారి చంపుతుండడం మనం చూస్తున్నాం. అంతేకాదు మైనార్టీలు - దళితులపై కూడా దాడులు పెరిగిపోతున్నాయి. మోడీపై కమ్యునిస్టులు - మావోయిస్టులు - విప్లవ సానుభూతి పరులు కత్తులు నూరుతున్నారు. ఇవి అంతిమంగా ఆయనపై ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. దీంతో ఎలాగైనా మోడీని సాధుజీవిగా చూపించాలని ‘హత్య కోణం’ బయటపెట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. అదేదో వేరే వాళ్లు చేసిన విమర్శ కాదు.. బీజేపీతో సాన్నిహిత్యం నడిపి విడిపోయిన ఎవర్ గ్రీన్ మిత్రుడు శివసేన నుంచే ఆ విమర్శలు రావడం హాట్ టాపిక్ గా మారింది.

మోడీని రాజీవ్ గాంధీ తరహాలో మీటింగ్ లకు హాజరైనప్పుడు చంపాలని మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు పోలీసులకు తాజాగా లేఖలు అందాయి. మావోయిస్టులు మోడీని హతమార్చాలని ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు పలు ఆధారాలను సైతం చూపారు. అందులో వరవరరావు లాంటి విప్లవ సానుభూతి పరులు పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ లేఖలను చూపించి మోడీని చంపేస్తారట అంటూ బీజేపీ నేతలు తీవ్ర ప్రచారం చేసి కావాల్సిన సానుభూతిని సంపాదించారు. అయితే తాజా పరిణామాలను గమనిస్తే సానుభూతి కంటే నవ్వులపాలే ఎక్కువ అయ్యారని అర్థమవుతోంది.

జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగి.. దేశంలోనే అత్యంత భద్రతగల ప్రధానిని చంపడమంటే మాటలు కాదు.. అలాంటి ఎవరో రాసిన లేఖను చూపి మోడీని చంపేస్తారని సానుభూతి పొందడంపై సెటైర్లు పడుతున్నాయి. తాజాగా శివసేన కూడా ఈ ప్రచారాన్ని వెటకారం చేసింది. కుట్ర కోణాన్ని తోసిపుచ్చుతూ ఇదంతా సినిమా స్క్రిప్ట్ లాగా ఉందంటూ శివసేన వ్యాఖ్యానించింది. ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఇదంతా ఓ హర్రర్ సినిమాను తలపిస్తోందని విమర్శించింది. దశాబ్ధాలుగా బీజేపీ వెంట నడిచిన శివసేనయే ఇదంతా ఓ జోక్ అంటూ కొట్టిపారేయడంతో సానుభూతి కాస్తా నవ్వుల పాలు అయినట్టు అయ్యింది.