Begin typing your search above and press return to search.

నంద్యాల బైపోల్స్‌:బాబుకు మ‌రో షాక్ త‌గిలిందే!

By:  Tupaki Desk   |   22 July 2017 11:32 AM GMT
నంద్యాల బైపోల్స్‌:బాబుకు మ‌రో షాక్ త‌గిలిందే!
X
రానున్న ఎన్నిక‌ల‌కు ఇది సెమీ ఫైన‌లేనంటూ టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చెబుతూ వ‌స్తున్న నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌నకు మ‌రో గట్టి షాక్ త‌గిలిన‌ట్టే క‌నిపిస్తోంది. భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం కార‌ణంగా త‌ప్ప‌నిస‌రిగా మారిన నంద్యాల ఉప ఎన్నిక‌కు సంబంధించి పార్టీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసే విష‌యంలో చంద్రబాబు నాన్చుడు ధోర‌ణికి విసిగిపోయిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి... టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొడుతూ వైసీపీలో చేరిపోయారు. మాజీ మంత్రిగానే కాకుండా దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి స‌న్నిహితంగా మెల‌గిన శిల్పాను వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా సాద‌రంగానే స్వాగ‌తించారు. ఆ వెంట‌నే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా శిల్పాకే టికెట్ ఖరారు చేశారు.

నంద్యాల నియోజకవ‌ర్గంలో శిల్పాకు మంచి అనుచ‌ర వ‌ర్గం ఉంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. శిల్పా వైసీపీలోకి మార‌డంతో అక్క‌డ విజ‌యావ‌కాశాలు త‌గ్గాయ‌ని భావించిన చంద్ర‌బాబు అండ్ కో... అక్క‌డి ముస్లిం నేత‌ల‌ను దువ్వేసి... వారి ఓట్ల‌ను గంప‌గుత్త‌గా కొట్టేసేందుకు మాజీ మంత్రి ఎన్ ఎండీ ఫ‌రూక్‌ కు ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేసింది. ఈ క్ర‌మంలో శిల్పా మోహ‌న్ రెడ్డి సోద‌రుడు... మొన్న‌టిదాకా టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా కొనసాగిన ఆ పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఇప్పుడు ఎటువైపు మొగ్గుతార‌న్న అంశంపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. అయితే త‌న సోద‌రుడు పార్టీ మారినా కూడా తాను మాత్రం పార్టీ మారేది లేదంటూ చ‌క్ర‌పాణి రెడ్ది చెబుతూ వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలో నేడు నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు రెండో ద‌ఫా వెళ్లిన చంద్ర‌బాబుకు పెద్ద షాక్ త‌గిలిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్టీ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న ఈ ఎన్నిక‌కు సంబంధించి పార్టీ అధినేత చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఎక్క‌డ కూడా క‌నిపించ‌లేద‌ట‌. దీంతో షాక్ తిన్న చంద్ర‌బాబు అస‌లు విష‌యం ఏమిట‌ని పార్టీ నేత‌ల‌ను ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. దీనిపై మంత్రి అఖిల‌ప్రియ‌ను ఆయ‌న ఆరా తీయ‌గా... ఆయ‌న‌కు షాకింగ్ స‌మాధానం వినిపించింద‌ట‌. గ‌త కొంత‌కాలంగా శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నార‌ని చెప్పార‌ట‌.

దీంతో షాక్ తిన్న చంద్ర‌బాబు... అయినా శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీ కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుంటే... విష‌యాన్ని త‌న‌కు చెప్పాలి క‌దా అంటూ పార్టీ స్థానిక నేత‌ల‌ను ప్ర‌శ్నించార‌ట‌. అఖిల‌ప్రియ చెప్పిన‌ట్లుగా చ‌క్ర‌పాణిరెడ్డి టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుంటే... రేపో - ఎల్లుండో ఆయ‌న వైసీపీలో చేరిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే... నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ప‌రాభ‌వాన్ని ఏ ఒక్క‌రు కూడా ఆప‌లేర‌న్న వాద‌న వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?