Begin typing your search above and press return to search.

మోడీ ప‌క్క‌లో బ‌ల్లెం కోరిక‌ను బ‌య‌ట‌పెట్టాడు

By:  Tupaki Desk   |   30 April 2016 8:01 AM GMT
మోడీ ప‌క్క‌లో బ‌ల్లెం కోరిక‌ను బ‌య‌ట‌పెట్టాడు
X
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు - బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించారు. బీజేపీ ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ ఆ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడటంలో ముందుండ‌ట‌మే కాకుండా ప్ర‌ధాన‌మంత్రి మోడీని చిక్కుల్లో ప‌డేసే సిన్హా త‌న కోరికను చెప్పేశారు. తనను బీహార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమిస్తానంటే సంతోషంగా అంగీకరిస్తానని సిన్హా అన్నారు.

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ను తనకు తమ్ముడిగానూ - ప్రియమిత్రుడిగానూ సిన్హా సంబోధించారు. భూమి పుత్రుడిగా బీహార్‌ కు సేవలు అందించడం తన బాధ్యతగా భావిస్తానని సిన్హా అన్నారు. అయితే, ఆ పదవి కోసం తాను డిమాండ్‌ గానీ - కమాండ్‌గానీ చేయనని సిన్హా స్పష్టం చేశారు. నితీష్‌ నేతృత్వంలో బీహార్‌ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని, అభివృద్ధి సాధిస్తున్నదని సిన్హా ప్రశంసించారు. అయితే, బీహార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం నటి-ఎంపీ రేఖ - కవి జావేద్‌ అఖ్తర్‌ పేర్లను కూడా ఆ రాష్ట్ర పర్యాటకశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీఎం - బీజేపీ ప్ర‌త్య‌ర్థి అయిన‌ నితీష్ కుమార్‌ ను బీజేపీ నేతలంతా విమర్శిస్తుండగా..తాను అభినందిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా సిన్హా తన సొంత పార్టీలో వివాదస్పదుడయ్యారు. అనంత‌రం కూడా సిన్హా అదే ట్రెండ్‌ ను కొన‌సాగించారు. తాజాగా బీహార్ బ్రాండ్ అంబాసిడ‌ర్ విష‌యంలో త‌న కోరిక‌ను బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.