Begin typing your search above and press return to search.

బీజేపీ కంచుకోటలో.. రాజ్ నాథ్ ను ఆమె ఓడిస్తుందా?

By:  Tupaki Desk   |   18 April 2019 2:30 PM GMT
బీజేపీ కంచుకోటలో.. రాజ్ నాథ్ ను ఆమె ఓడిస్తుందా?
X
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీద ఎస్పీ-బీఎస్పీల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పూనమ్ సిన్హా. బాలీవుడ్ ప్రముఖ నటుడు - అలనాటి స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్. ఎస్పీ ముఖ్య నేత అఖిలేష్ యాదవ్ - ఆయన భార్య తోడు రాగా.. పూనమ్ సిన్హా తన నామినేషన్ పత్రాలను అధికారులకు ఇచ్చారు.

ఇలా కేంద్ర హోం శాఖ మంత్రిని ఒక మహిళా అభ్యర్థి ఢీ కొడుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా పూనమ్ కే మద్దతును ఇవ్వొచ్చనే అంచనాలున్నాయి. ఆ ఒప్పందం మేరకే శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలుస్తోంది.

ఇటీవలే శత్రుఘ్న కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.ఐదేళ్లు ఆయన మోడీ మీద నిరసనస్వరం వినిపిస్తూ ఉన్నారు. చివరకు ఆయన కాంగ్రెస్ లో చేరారు. తను ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచినే ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.

ఆయన భార్య ఎస్పీలో చేరారు. లక్నో అభ్యర్థిత్వం పొందారు. ఇలా భార్యభర్త చెరో పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉండటం విశేషం. యూపీ వరకూ ఎస్పీ- కాంగ్రెస్ ల పొత్తు అధికారికంగా ఏమీ లేదు. కొన్ని చోట్ల ఈ పార్టీలు గట్టిగా పోరాడుతూ ఉన్నాయి.

ఇక లక్నో విషయానికి వస్తే.. అది బీజేపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో చాలా కాలంగా బీజేపీ హవా నడుస్తూ ఉంది. ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ ఎప్పుడూ ఈ నియోజకవర్గంలో గెలిచిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు పూనమ్ సిన్హా ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి!