Begin typing your search above and press return to search.

విభజన సీమాంధ్రులే చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   28 Aug 2016 5:37 AM GMT
విభజన సీమాంధ్రులే చేసుకున్నారా?
X
రాష్ట్ర విభజనపై సీమాంధ్రులు ప్రశ్నించే అవకాశం లేదా? తమకు అన్యాయం జరిగిందని వారు వాపోవటంలో అర్థం లేదా? విభజన జరిగిన నాటి నుంచి తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందంటూ తరచూ ఆక్రోశం వ్యక్తం చేసే సీమాంధ్రులకు నిజంగా ఆ హక్కు ఉందా? ఆగ్రహం వ్యక్తం చేయటం ధర్మసమ్మతమేనా? అన్న ప్రశ్నలు వేసుకుంటే ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెర మీదకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించే అంశాలేవీ సొంత అభిప్రాయాలు మాత్రం కావు.

ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి గళం విప్పి.. మూడు దశల్లో పోరాటం చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకూ తాను విశ్రమించనని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్ మాటల్నే ప్రస్తావిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. విభజన అంశాన్ని వ్యతిరేకించే హక్కు సీమాంధ్రులకు ఉందా? అన్న ప్రశ్న పవన్ కల్యాణ్ తిరుపతి ప్రసంగం విన్న తర్వాత కలిగే మొదటి సందేహం.

ఎందుకంటే.. ఏ సీమాంధ్ర నేత ప్రస్తావించని ఒక పాత విషయాన్ని.. ఒకనిజాన్ని ఆయన ధైర్యంగా ప్రస్తావించారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా అండ్ టీం 2014లో డిసైడ్ చేస్తే.. అందుకు కొన్ని సంవత్సరాల ముందే.. కాకినాడ సభలో బీజేపీ ఒక ఓటుతో రెండు రాష్ట్రాలని తీర్మానం చేసిందన్న విషయాన్ని గుర్తు చేసిందన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో సీమాంధ్ర నుంచి తెలంగాణను వేరు చేస్తామని బీజేపీ సగర్వంగా ప్రకటించినప్పుడు సీమాంద్రులు ఏం చేస్తున్నారు? తెలంగాణను తమ నుంచి విడగొట్టే బీజేపీ దుష్ట ఆలోచనను ఆ రోజే నేతలంతా ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు అరుస్తూ.. ఆక్రోశం వ్యక్తం చేస్తున్న వారంతా నాటి బీజేపీ తీర్మానాన్ని తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించలేదు?

నాడు మౌనం వహించిన సీమాంధ్రులకు విభజనను వ్యతిరేకించే హక్కు ఉంటుందా? అన్నది ఒక ప్రశ్న. నిజానికి బీజేపీకి ఎంత ధైర్యం ఉంటే.. సీమాంధ్ర ప్రాంతంలో సమావేశం పెట్టి.. సీమాంధ్ర నుంచి తెలంగాణను విడగొడతామని ప్రకటిస్తుంది? విభజనను వ్యతిరేకించే సీమాంధ్రుల ముందు.. విభజన మాట ఎత్తితే తమకు భారీ నష్టమన్న విషయాన్ని నాడే బీజేపీకి అర్థమయ్యేలా సీమాంధ్రులు చెప్పి ఉంటే ఈ రోజు విషయం ఇక్కడి వరకూ వచ్చేది కాదుకదా?

ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. జైరాం రమేశ్ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించటం. సీమాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించిన జైరాం నవ్వుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేశారంటూ ఆయనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు పవన్. నిజమే.. ఏపీ తాజా పరిస్థితుల్లో ఆయన కడుపు మంట అలాంటిది. దాన్ని తప్పు పట్టలేం. మిగిలిన రాజకీయ నేతల్లా బూతులు మాట్లాడే కల్చర్ లేని పవన్.. తనలో ఆగ్రహం పాళ్లు ఎక్కువ అవుతున్న కొద్దీ ఆయన మాటలో ప్రేమ మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏపీకి తమ చేష్టల ద్వారా నష్టం చేసిన వారందరిని పవన్.. తానెంతగా ఇష్టపడేది.. ‘‘తాను వారిని బాగా ఇష్టపడతాను. వారంటే నాకు చాలా ఇష్టం’’లాంటి మాటలతో చెప్పేస్తుంటారు.

మరి.. జైరాం రమేశ్ విషయంలో సీమాంధ్రుల స్పందన ఏమిటి? ఈ రోజు జైరాం రమేశ్ ప్రస్తావన తీసుకొచ్చిన వెంటనే ఈలలు వేసిన జనాలు.. సీమాంధ్రకు అంత నష్టం చేసిన జైరాం రమేశ్ ఏపీకి వచ్చినప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా నిలదీశారా? ఆ ప్రయత్నం సగటు జీవి చేయాల్సిన అవసరం లేదు. సీమాంధ్ర కోసం.. సీమాంధ్రప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని మాటలు చెప్పే నేతలు సైతం ఎందుకు ప్రయత్నం చేయలేదు?

అంతదాకా ఎందుకు.. విభజనకు నిర్ణయం తీసుకున్నకాంగ్రెస్ కానీ.. మద్దుతు ఇచ్చిన బీజేపీ నేతల్ని కానీ సీమాంధ్రులు సూటిగా ప్రశ్నించారా? అంతదాకా ఎందుకు? విభజనకు తొలి లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఆయన్ను సీమాంధ్రులు ప్రశ్నించటం తర్వాత.. తాజాగా అధికారమే ఇచ్చారు కదా. ఇన్ని తప్పులు సీమాంధ్రులు తమ దగ్గర పెట్టుకొని విభజన కారణంగా తమకుభారీ నష్టం జరిగిందని ఆక్రోశిస్తేఅర్థం ఉంటుందా? జరిగిందేదో జరిగింది. కానీ.. ఇప్పటికైనా ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడే ఏఒక్కరిని సీమాంధ్రులు వదిలిపెట్టకూడదు. అప్పుడు మాత్రమే హోదా సాధ్యమవుతుంది. తెలంగాణరాష్ట్రం ఏర్పడితే లాభనష్టాల గురించి ఒక్కరైనా మాట్లాడారా? ఎవరి నోటి నుంచైనా తెలంగాణ సెంటిమెంట్ గురించి మాత్రమే ప్రస్తావించారే కానీ విమర్శ చేయటానికి సాహసించలేదు. అదంతా తెలంగాణ ఉద్యమనాయకులు వ్యూహ చతురతగా చెప్పాలి. తాజాగా ప్రత్యేక హోదా అంశం మీద కూడా అలాంటి పరిస్థితే ఉండాలి. హోదా విషయానికి వ్యతిరేకంగా నోరు విప్పటానికి ఏ నేత అయినా భయపడేలా ఉండాలి. హోదా ఇచ్చి.. దాన్ని పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చేయగలిగిన నాడు మాత్రమే విభజన గురించి ఎంతోకొంత ఆక్రోశించే అవకాశం సీమాంధ్రులకు ఉందన్నది మర్చిపోకూడదు. జరిగిపోయిన విషయాల గురించి అదే పనిగా మాట్లాడుకునే కన్నా.. జరగాల్సిన పని మీద ఫోకస్ చేస్తే మంచిది. ఈ చేదు నిజాన్ని సీమాధ్రులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.