Begin typing your search above and press return to search.

ట్రంప్ ఉత్తర్వులకు కోర్టులో చుక్కెదురు

By:  Tupaki Desk   |   27 April 2017 6:54 AM GMT
ట్రంప్ ఉత్తర్వులకు కోర్టులో చుక్కెదురు
X
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన శరణార్థులకు ఆశ్రయం కల్పించే నగరాలకు నిధులను నిరాకరిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను శాన్‌ ఫ్రాన్సిస్కో జిల్లా జడ్జి విలియం ఓరిక్ నిలిపివేశారు. గత జనవరిలో జారీ చేసిన అధ్యక్ష ఆదేశాల్లోని కేంద్ర సాయం నిలిపివేత నిబంధనలను జడ్జి దుయ్యబట్టారు. అధ్యక్షుడు ట్రంప్ తన రాజ్యాంగ అధికారాలను అతిక్రమిస్తున్నారని విమర్శించారు. ఇది స‌రికాద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు కోర్టు తీర్పుపై ట్రంప్‌ మండిపడ్డారు. న్యాయ‌స్థానం ఆదేశాల‌పై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ట్విట్టర్‌ లో ట్రంప్ ప్ర‌క‌టించారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే నగరాలకు నిధులను నిలిపివేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాన్ని ట్రంప్ ఆదేశించారు. కాగా, కోర్టు తీర్పు వల్ల ప్రజలకు ఎంతో ఉపశమనం లభించిందని శాన్‌ ఫ్రాన్సిస్కో అటార్నీ డెనిస్ హెరెరా వ్యాఖ్యానించారు.

కాగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక పత్రికా స్వాతంత్య్రానికి తీవ్ర ప్రమాదం ఎదురవుతున్నదని రిపోర్టర్స్ వితౌడ్ బార్డర్స్ సంస్థ ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర సూచికలో తెలిపింది. నియంతృత్వం పోకడలున్న నేతలు అధికారంలోకి రావడంతో పలుదేశాల్లో మీడియా వ్యతిరేకత పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలో ముప్పు గతంలో ఎన్నడూ లేదని వివరించింది. రష్యా - భారత్ - చైనాతో సహా మొత్తం 72 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ అత్యంత ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్ఛ సూచికలో అమెరికా - బ్రిటన్ స్థానాలు పడిపోవడం గమనార్హం.

మ‌రోవైపు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు చెక్‌ పోస్టుల్లో ముస్లిం వ్యతిరేక ఘటనలు వెయ్యిశాతం పెరిగాయని అమెరికా ఇస్లామిక్ సంబంధాల మండలి (కెయిర్) అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా కస్టమ్స్ అధికారులు సరిహద్దు పోస్టులలో ముస్లింలను వేధిస్తున్నారని కెయిర్ పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/