Begin typing your search above and press return to search.

మహాకూటమి.. సాగతీతల పర్వం

By:  Tupaki Desk   |   8 Nov 2018 6:37 AM GMT
మహాకూటమి.. సాగతీతల పర్వం
X
మహాకూటమి సీట్ల పంపిణీలో అంతులేని సాగతీత కొనసాగుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను చివరి విడతలో జరిపేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దాదాపు రెండు నెలల సమయమిచ్చింది. అసెంబ్లీని రద్దు చేయగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 105మంది అభ్యర్థులను నెలరోజుల ముందే ప్రకటించి ఎన్నికల వేడిని రగిల్చాడు. ఇక బలమైన టీఆర్ ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పడింది. సీపీఐ - టీడీపీ - టీజేఎస్ లు భాగస్వామ్యులుగా చేరాయి. కానీ కూటమికి అంకురార్పణ జరిగి నెల రోజులు కావస్తున్నా.. ఇంకా మహాకూటమి సీట్ల సర్దుబాటు కాక దాని మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

తాము కోరుతున్న నియోజకవర్గాలపై టీడీపీ - సీపీఐ - టీజేఎస్ బేరసారాలకు దిగుతుండడంతో ఆ చోట్ల కాంగ్రెస్ నేతలను ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. రెబల్స్ బెడద పార్టీ ముంచుతుందా అన్న అనుమానాలను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తుదిజాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. మిగిలిన సీట్లలోనే సమస్య ఏర్పడింది. వీటిని భాగస్వామ్య పార్టీలకు ఇస్తే కాంగ్రెస్ కు రెబల్స్ బెడత తాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ 57 మినహా మిగతా స్థానాల్లో రెండు కంటే ఎక్కువమంది టికెట్లు ఆశిస్తూ కాంగ్రెస్ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ సీట్లలో బలమైన - రాజకీయ - ఆర్థిక గెలిచే అభ్యర్థుల కోసం శోధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట..

బుధవారం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కూడా ఢిల్లీలో సమావేశమై ఎటూ తేల్చలేదు. దీంతో టికెట్ కావాల్సిన కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బు సంచులు - ఢిల్లీ స్థాయి పరపతి కలిగిన వ్యక్తులతో కాంగ్రెస్ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. కానీ మరో రెండు రోజుల వరకూ టికెట్ల కేటాయింపు జరగదని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో మహాకూటమి సస్సెన్స్ ప్రస్తుతానికైతే వీడడం లేదు.