Begin typing your search above and press return to search.

కొత్త గెట‌ప్‌ లో స‌తీశ్ రెడ్డిని చూశారా?

By:  Tupaki Desk   |   12 Jan 2017 9:37 AM GMT
కొత్త గెట‌ప్‌ లో స‌తీశ్ రెడ్డిని చూశారా?
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై చాలెంజ్ చేసిన నాయ‌కుడు ఎట్ట‌కేల‌కు దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. శాసనమండలి డిప్యూటి చైర్మెన్‌ ఎస్‌ వి సతీష్‌ కుమార్‌ రెడ్డి గత 19 నెలలుగా చేసిన శపథం ఎట్టకేలకు నెరవేరింది. గండికోట జలాశయం నుంచి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాళెం రిజర్వాయర్‌కు, అలాగే పీబీసీకి - సీబీఆర్‌ కు నీరు విడుదల అయ్యేవరకు తాను గెడ్డం తీయనని 2015 జూన్‌ 2న సతీష్‌ రెడ్డి కడపలో జరిగిన నవనిర్మాణ ప్రతిజ్ఞ సభలో ప్రతిన బూనారు. తాజాగా పులివెందుల నియోజకవర్గం పైడిపాళెం రిజర్వాయర్‌ వద్ద సీఎం చంద్రబాబు నాయుడుతో గండికోట జలాశయం నుంచి కృష్ణా జలాలను రిజర్వా యర్‌లోకి విడుదల చేయించారు.

ఈ సందర్భంగా సతీష్‌ రెడ్డి ఎట్టకేలకు తాను అనుకున్న శపథం మేరకు కొండాపురం మండలం లావనూరు సమీపంలోని షిరిడీ సాయి మందిరంలో గెడ్డం తీయించి ప్రతిజ్ఞను విరమించా రు. ఈ కార్యక్రమంలో లాంచనంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్‌. శ్రీనివాసుల రెడ్డి సాంప్రదాయబద్ధంగా తలనీలాలను రెండు కత్తెర్లిచ్చి ప్రారంభించారు. తన శపథం నెరవేరేందుకు స‌హ‌క‌రించిన‌ సీఎం చంద్రబాబు నాయుడుకు, జిల్లా టీడీపీ ముఖ్య నేతలకు సహకరించిన జిల్లాలోని ప్రజలకు - పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి సతీష్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/