Begin typing your search above and press return to search.

స‌తీశ్‌ రెడ్డి గ‌డ్డం దీక్ష ఫ‌లించేసింది!

By:  Tupaki Desk   |   11 Jan 2017 5:27 AM GMT
స‌తీశ్‌ రెడ్డి గ‌డ్డం దీక్ష ఫ‌లించేసింది!
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ స‌తీశ్ రెడ్డి గుర్తున్నారుగా. అదేనండి... బారెడంత గ‌డ్డం పెంచేసి... ఏ దేవుడికో మొక్కు తీర్చుకునే త‌ర‌హాలో నెల‌ల త‌ర‌బ‌డి గ‌డ్డం పెంచేసిన క‌డ‌ప జిల్లా నేత‌. అంత‌కుముందు ట్రిమ్‌గా చ‌క్క‌టి క్రాప్‌తో క‌నిపించిన ఆయ‌న‌... క‌డ‌ప జిల్లా పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ అభ్య‌ర్థుల‌పై టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతూ వ‌చ్చారు. ఏ ఒక్క‌సారి కూడా విజ‌యం వ‌రించ‌కున్నా... ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఆయ‌న వైఎస్ కుటుంబ స‌భ్యుల‌పైనా రాజ‌కీయంగా పోరు సాగిస్తూనే ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీకి ఎదురొడ్డి పోరాడుతున్న ఆయ‌న ప‌ట్టుద‌ల‌ను గుర్తించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... కొంత‌కాలం క్రితం స‌తీశ్ రెడ్డిని పెద్ద‌ల స‌భ‌కు పంపారు. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావ‌డంతో స‌తీశ్ రెడ్డికి మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా అడ‌క్కుండానే అందివ‌చ్చింది.

ఏ ప‌ద‌వి లేన‌ప్పుడు, పార్టీ అధికారంలో లేన‌ప్పుడే... స‌తీశ్ రెడ్డి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటూ వ‌చ్చారు. అలాంటిది పార్టీ అధికారంలోకి వ‌చ్చి... తాను కూడా ఓ ప్ర‌ధాన ప‌ద‌విలో ఉన్న స‌మ‌యాన్ని ఆయ‌న బాగానే స‌ద్వినియోగం చేసుకున్నారు. పులివెందుల‌కు కృష్ణా జ‌లాల‌ను ర‌ప్పించేందుకు ఉద్దేశించిన పైడిపాలెం ప్రాజెక్టును పూర్తి చేయించ‌డంపై ఆయ‌న దృష్టి సారించారు. అప్ప‌టికే దాదాపుగా 90 శాతం ప‌నులు పూర్తి అయిన ఈ ప్రాజెక్టు కోసం కేవ‌లం రూ.25 కోట్లు ఖ‌ర్చు చేస్తే స‌రిపోతుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న చంద్ర‌బాబు చెవిన వేశారు. అస‌లే పులివెందుల అంటేనే... వైఎస్ ఫ్యామిలీకి అడ్డాగా పేరుప‌డిపోయింది. అలాంటి నియోజ‌కవ‌ర్గానికి సాగు, తాగు నీరిస్తే... పార్టీకి మంచి మైలేజీ వ‌స్తుంద‌ని కూడా స‌తీశ్ రెడ్డి... చంద్ర‌బాబుకు విష‌యాన్ని పూర్తిగా అర్థ‌మ‌య్యేలా వివ‌రించ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే చెప్పాలి.

చంద్ర‌బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే... పైడిపాలెం ప్రాజెక్టును అతి త్వ‌ర‌లో పూర్తి చేయ‌నున్న‌ట్లు స‌తీశ్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై వైసీపీ నేత‌లు స‌వాళ్లు విస‌ర‌డంతో ఆయ‌న ఏకంగా దీక్ష‌కే దిగారు. పైడిపాలెం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావ‌డంతో పాటు పులివెందుల‌కు కృష్ణా జ‌లాలు వ‌చ్చేదాకా గ‌డ్డం తీయ‌బోన‌ని ప్ర‌క‌టించారు. ఇదంతా జ‌రిగి ఇప్ప‌టికి 18 నెల‌ల గ‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ప్రాజెక్టు ప‌నుల‌ను స‌తీశ్ రెడ్డి ప‌రుగులు పెట్టించారు. ప్ర‌భుత్వం నుంచి నిధులు రాబ‌ట్ట‌డంలోనూ ఆయ‌న త‌న‌దైన శైలిలో స‌త్తా చాటారు. ప్రాజెక్టు పూర్తి కాగా... మరికాసేప‌ట్లో దానిని చంద్ర‌బాబు ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం పూర్తి కాగానే... ప్రాజెక్టుకు స‌మీపంలోనే స‌తీశ్ రెడ్డి త‌న గ‌డ్డం తీయించుకోనున్నారు. పంతం ప‌ట్టి మ‌రీ... ప్రాజెక్టు పూర్తి చేయించిన స‌తీశ్ రెడ్డి... గ‌డ్డం తీయించుకునే కార్య‌క్ర‌మానికి పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/