Begin typing your search above and press return to search.

అంతరిక్షం నుంచి సర్దార్ పటేల్ విగ్రహం..!

By:  Tupaki Desk   |   17 Nov 2018 4:30 PM GMT
అంతరిక్షం నుంచి సర్దార్ పటేల్ విగ్రహం..!
X
దేశంలో ఎంతోమందికి ప్రతిష్ఠగా, మరికొందరికి పనికిమాలిన పనిగా కనిపిస్తున్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఘనత ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోంచి కనిపిస్తోందట. తాజాగాస్కైలాబ్ ఆధ్వర్యంలోని అమెరికన్‌ కాన్‌స్టిలేషన్‌ ఆఫ్ శాటిలైట్స్ ఈ విగ్రహం చిత్రాన్ని తీసింది. ఆ విగ్రహం టాప్‌ వ్యూ, పక్కనే నర్మదా నది ప్రవాహం మనకు అందులో దర్శనమిస్తాయి.

2017లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పీఎస్ఎల్‌వీ లాంచింగ్‌ వెహికిల్ ద్వారా ఒకేసారి 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించింది. అయితే దానిలో 88 ఎర్త్ ఇమేజింగ్ డోవ్ శాటిలైట్లు ఈ అమెరికా సంస్థవే. అక్టోబరు 31న ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కేవదీయ వద్ద సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం కంటే ఎత్తయినది. రూ.2,989 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే.. ఈ విగ్రహం కోసం అక్కడి రైతుల భూములను తీసుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇతర అభివృద్ధి పనులను పక్కనపెట్టి మరీ దీనిని నిర్మించారని.. అలాగే విదేశాల నుంచి వచ్చిన నిదులనూ దీనికి మళ్లించారని విమర్శలున్నాయి. మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాని దీన్ని చైనాలో తయారు చేయించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఈ విగ్రహానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రం విడుదల కావడంతో పటేల్ అభిమానులు, బీజేపీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.