Begin typing your search above and press return to search.

అమ్మో... ఆ ఎంపీ చంపేస్తాడట

By:  Tupaki Desk   |   6 Oct 2015 9:50 AM GMT
అమ్మో... ఆ ఎంపీ చంపేస్తాడట
X
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. గోవులను సంరక్షించేందుకు చావడానికైనా అవసరమైతే చంపడానికైనా సిద్ధమని అన్నారు. గోవులను సంరక్షించేందుక మేం సదా సిద్ధంగా ఉంటామని, ఎవరైనా మా తల్లిని హత్య చేయడానికి ప్రయత్నిస్తే మౌనంగా ఉండమని పేర్కొన్నారు. గో రక్షణ విషయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలు తేటతెల్లమయ్యాయని సాక్షి మహరాజ్ అన్నారు. ఆ పార్టీ నాయకుడు అజాం ఖాన్ పాకిస్థానీ అని ఆరోపించారు. పాక్ రాజకీయ శక్తిపై ఆయనకు విశ్వాసం ఉందని, భారత మాతను మంత్రగత్తెగా అజాం ఖాన్ అభివర్ణిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సాక్షి మహారాజ్ కు ఏమాత్రం కొత్త కాదు ఆయన ఈ టెర్ములో ఎంపీ కావడానికి ముందు, ఆ తరువాత కూడా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆయన గాంధీని చంపిన గాడ్సే ను గొప్ప దేశభక్తుడిగా కీర్తించారు. బీజేపీ కార్యక్రమం ఘర్ వాపసీ నేపథ్యంలోనూ ఆయన పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేదార్ నాథ్ ఆలయంలోకి రాహుల్ గాంధీ వెళ్లడం వల్లే నేపాల్ లో భూకంపం వచ్చిందని అని వివాదాస్పదుడయ్యారు. బీఫ్ తినే రాహుల్ కేదార్ నాథ్ ను సందర్శించడంతోనే ఇలాంటి ఉత్పాతం సంభవించిందని ఆయన అనడంతో అప్పట్లో కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. అలాగే కరెక్టుగా తొమ్మిది నెలల కిందట ఈ ఏడాది జనవరి 6న కూడా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రతి హిందూ మహిళా కనీసం నలుగురు పిల్లలను కని దేశంలో హిందువుల సంఖ్య పెంచాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు.

ఇలా ప్రతి సందర్భంలోనూ సాక్షి మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ విపక్షాల విమర్శలకు గురవుతున్నా బీజేపీ మాత్రం ఆయన్ను ఎన్నడూ నిలువరించిన దాఖలాలు లేవు. దీంతో ఆయన కామెంట్లను పార్టీ మాటగానే అంతా భావిస్తుంటారు. మోడీ తన ఈ టెర్ములోనే రామమందిరం నిర్మిస్తారని కూడా ఆయన ఓసారి అన్నారు. తాజాగా ఆయన చావడానికైనా చంపడానికైనా సిద్ధమేనని అనడంతో ఆయన అందరిలాంటి ఎంపీనా కిల్లర్ ఎంపీనా అన్న విమర్శలు వస్తున్నాయి.