Begin typing your search above and press return to search.

బాబు ‘‘కోర్టు’’లో హైకోర్టు బంతి పడింది

By:  Tupaki Desk   |   26 May 2016 11:10 AM GMT
బాబు ‘‘కోర్టు’’లో హైకోర్టు బంతి పడింది
X
విభజన నేపథ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పలు అంశాలు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వటం లేదన్న ఫిర్యాదును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చేయటం తెలిసిందే. ప్రత్యేక హోదా మొదలుకొని.. ప్రత్యేక ప్యాకేజీతో పాటు.. విశాఖకు రైల్వే జోన్ లాంటివెన్నో కేంద్రం నుంచి స్పందన రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఒక విషయంలో మాత్రం కేంద్రం సిద్దంగా ఉన్నా.. చంద్రబాబు నుంచి స్పందన రావటం లేదన్న మాట ఇప్పుడు బాబు వైపు వేలెత్తి చూపేలా చేస్తుందని చెప్పాలి.

విభజన జరిగి రెండేళ్లు అవుతున్నా.. హైకోర్టు విభజన జరగకపోవటం తెలిసిందే. హైకోర్టు విభజన వెనువెంటనే జరగాలన్న వాదనను తెలంగాణ సర్కారుతో పాటు.. తెలంగాణ న్యాయవాదులు బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు నిరసనలు.. ఆందోళనలు చేపట్టారు కూడా. ఇదిలా ఉంటే.. హైకోర్టు విభజనకు సంబంధించి తన తప్పు ఏమీ లేదంటూ కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ నిస్సహాయతను వ్యక్తం చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విభజన చట్టం ప్రకారం.. ఏపీ హైకోర్టును హైదరాబాద్ లో ఏర్పాటు చేయటం సాధ్యం కాదని.. ఏపీలోనే ఏర్పాటు చేయాలని.. హైకోర్టు ఏర్పాటుకు ఏపీ సర్కారు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని సదానంద గౌడ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మౌలిక సదుపాయాల్ని కల్పించే విషయంలో ఏపీ సర్కారు చొరవ చూపకున్నా.. స్పందించకున్నా తానేం చేయగలనంటూ కేంద్రమంత్రి చేతులెత్తేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన అంశాల్లో కేంద్రం చొరవ చూపటం లేదని.. తమను పట్టించుకోవటం లేదని ఏపీ సర్కారు ఆక్రోశిస్తుంటే.. హైకోర్టు విషయంలో మాత్రం బాబుదే బాధ్యత అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వేలు బాబు దిక్కుకు చూపే పరిస్థితి. ఏపీ హైకోర్టు ఏర్పాటు విషయంలో బాబు ఎందుకు రియాక్ట్ కావటం లేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.