Begin typing your search above and press return to search.

ఉద్యోగుల తొల‌గింపుపై ఇన్ఫీ మూర్తి అప్‌ సెట్‌

By:  Tupaki Desk   |   26 May 2017 3:10 PM GMT
ఉద్యోగుల తొల‌గింపుపై ఇన్ఫీ మూర్తి అప్‌ సెట్‌
X
ఇన్ఫోసిస్ స‌హ‌వ్య‌వస్థాప‌కుడు, మాజీ చైర్మ‌న్ ఎన్ ఆర్ నారాయ‌ణ‌మూర్తి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న తొల‌గింపుల ప్ర‌క్రియ‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర్ణ‌యం బాధ‌కార‌మ‌ని ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఈమెయిల్ రిప్లైలో ఆయ‌న వివ‌రించారు. అయితే ఇంత‌కు మించి తొల‌గింపుల‌పై మ‌రేమీ స్పందించ‌క‌పోవ‌డం ఆసక్తిక‌రం. తొలిదశలో వెయ్యిమందికి పైగా ప్రాజెక్టు మేనేజర్లు, గ్రూపు ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్‌ ఆర్కిటెక్ట్‌లతో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగులను ఇళ్లకు పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. మొత్తంమీద 10 నుండి 20 శాతం మందిని పనితీరు బాలేదన్న సాకుతో ఉద్యోగాల నుండి తొలగించేందుకు కసరత్తు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో నారాయ‌ణ‌మూర్తి వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించ‌కున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో ఆటోమేషన్‌, డిజిటల్‌ టెక్నాలజీల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం మరింత వేగంగా దూసుకొస్తోందని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త హెచ్‌1 బి వీసా సంస్కరణల నేపథ్యం పరిశ్రమను మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. భారత్‌లో ఈ పరిస్థితి మరికాస్త తీవ్రంగా ఉందని ఆ రంగం నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా 10-20 ఏళ్ల అనుభవం, సీనియారిటీ కలిగిన ఉన్నత సిబ్బందిని తొలగించడం ద్వారా పొదుపు చర్యలు చేపట్టాలని పలు ఐటి కంపెనీలు భావిస్తున్నాయి. ఈ ప్రమాదం అటు ఉన్నత స్థానాల్లో, ఇటు దిగువస్థాయిలో ఉన్న వారందరినీ వెన్నాడుతోంది. దీంతో 150 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కాగ్నిజెంట్‌ ఆరు వేల మందికి ఉద్వాసన పలికే పనిలో ఉండగా, ఇన్ఫోసిస్‌ 1000 మంది సిబ్బందిని ఇంటికి పంపించనుంద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. విప్రో 10 శాతం సిబ్బందిని తొలగించనుంది. ప్రతి సంవత్సరం చేసే సమీక్షలో భాగంగా ఈ తొలగింపులనీ, 2017లో తమ ఉద్యోగుల్లో చాలామందికి అభివద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణనిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/