Begin typing your search above and press return to search.

‘‘వైఎస్ చెల్లెమ్మ’’కు కేసీఆర్ షాకిచ్చారు

By:  Tupaki Desk   |   24 Aug 2016 10:04 AM GMT
‘‘వైఎస్ చెల్లెమ్మ’’కు కేసీఆర్ షాకిచ్చారు
X
చేవెళ్ల చెల్లెమ్మగా.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డికి తాజాగా షాక్ తగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో.. మరీ ముఖ్యంగా వైఎస్ హయాంలో చేవెళ్ల చెల్లెమ్మకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కీలకమైన కార్యక్రమాలకు చెల్లెమ్మ చేతుల మీద షురూ చేసేవారు. తన పాదయాత్ర సూపర్ డూపర్ సక్సెస్ అయిన నాటి నుంచి వైఎస్ కు చేవెళ్ల సెంటిమెంట్ మనసులో పడిపోయింది.

దీనికి తగ్గట్లే తన ప్రభుత్వంలో సబితమ్మకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్.. ఏకంగా హోం మంత్రి పదవిని అప్పజెప్పారు. తెలుగు నేల మీద తొలి మహిళా హోం మంత్రిగా సబితాఇంద్రారెడ్డి రికార్డు సృష్టించారు. వైఎస్ జమానా ముగిసిన తర్వాత ఆమె ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. తర్వాతి కాలంలో హోం మంత్రి పదవి నుంచి మారటం ఒకటైతే..సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గాలికి సబితా ఇంద్రారెడ్డి ఓటమిపాలు కావటంతో ఆమె మాజీగా మారిపోయారు. అయితే.. మాజీ హోంమంత్రి కింద ఆమెకు గన్ మెన్లను ప్రభుత్వం ఇస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.

మాజీ హోంమంత్రిగా సబితాఇంద్రారెడ్డికి కల్పిస్తున్న భద్రతను ఇకపై కొనసాగించలేమంటూ కేసీఆర్ ప్రభుత్వం ఆమెకు ఓ లేఖలో స్పష్టం చేశారు. తక్షణమే గన్ మెన్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా సబితమ్మకు రాసిన లేఖలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సబితా ఇంద్రారెడ్డికి ప్రస్తుతం రక్షణగా ఉన్న గన్ మెన్లు ఏక్షణంలో అయినా వైదొలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై సబితాఇంద్రరెడ్డి కోర్టును ఆశ్రయించే వీలుందన్న మాట వినిపిస్తోంది. గతంలో గన్ మెన్ల సౌకర్యం ఉన్న కొందరు విపక్ష నేతల విషయంలోనూ కేసీఆర్ సర్కారు ఇదే తీరులో వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో సబితా ఇంద్రరెడ్డి చేరారని చెప్పాలి.