Begin typing your search above and press return to search.

ఆ వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కుతారట

By:  Tupaki Desk   |   3 May 2016 1:15 PM GMT
ఆ వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కుతారట
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌రుస ఎదురుదెబ్బ‌ల ప‌రంప‌ర కొనసాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అధికార తెలుగుదేశం పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లో భాగంగా మొద‌ట జంపింగ్‌ ల‌ను ప్రారంభించిన క‌ర్నూలు జిల్లాలో మ‌రో షాక్ త‌గిలే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ నేతలు గురి పెట్టారని తెలుస్తోంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్యతో సంప్రదింపులు జరుపుతున్నారని అధికార పార్టీలో చర్చ సాగుతోంది. ఎస్వీ మోహన రెడ్డి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆయన చేరిక ఖరారైందని అంటున్నారు. ఆ కారణంగానే కరవుపై వైకాపా ఇచ్చిన ఆందోళన పిలుపు కర్నూలు నగరంలో కనిపించలేదని పేర్కొంటున్నారు. వీరిద్దరితో చర్చలు సఫలీకృతం చేసి ఈ నెల 7వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్వీ మోహన రెడ్డిని ఒప్పించడానికి ఆయ‌న బావ‌, ఇప్ప‌టికే టీడీపీలో చేరిన‌ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. పార్టీ మార్పుపై ఆలోచనలో ఉన్న ఎస్వీ మోహన రెడ్డి వైకాపా ఇచ్చిన ఆందోళన పిలుపుపై దృష్టి సారించలేకపోయారన్న చర్చ సాగుతోంది. ఐజయ్య చేరికకు సంబంధించి టిడిపి - వైకాపాకు చెందిన నాయకులతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా...వైకాపా పిలుపునిచ్చిన కరవు ఆందోళన కర్నూలు జిల్లాలో పేలవంగా జరిగింది. వైకాపా నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన నంద్యాల - ఆళ్లగడ్డ - కోడుమూరు - శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేల స్థానంలో పార్టీకి ఇన్‌ చార్జిలు కూడా లేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో ఎక్కడా ఆందోళన ఛాయలు కనిపించలేదు. శ్రీశైలం - కోడుమూరు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కొద్ది సేపు ధర్నా నిర్వహించినప్పటికీ ప్రధాన నాయకులు ఎవరూ హాజరు కాలేదు. ఆళ్లగడ్డ - నంద్యాల నియోజకవర్గాలతో పాటు వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు నగరంలో కూడా ఆందోళన కార్యక్రమం జరగకపోవడం చర్చకు దారి తీసింది.

మ‌రోవైపు పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాలు ఉహగానాలేనని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కరవు పీడిత ప్రాంత మండల కేంద్రాల్లో మాత్రమే ఆందోళనలు నిర్వహించాల్సి ఉందని ఆయన తెలిపారు. కర్నూలు నగరం కరవుపీడత ప్రాంతంలోకి రాదు కాబట్టే ధర్నా చేయలేదని వివరణ ఇచ్చారు.