Begin typing your search above and press return to search.

సైకిల్ పార్టీతో 25 ఏళ్ల త‌ర్వాత ఆ పార్టీ పొత్తు

By:  Tupaki Desk   |   12 Jan 2019 7:02 PM GMT
సైకిల్ పార్టీతో 25 ఏళ్ల త‌ర్వాత ఆ పార్టీ పొత్తు
X
దేశ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణాం చోటుచేసుకుంది. లోక్‌ సభ ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) - బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని ఆ పార్టీల ర‌థ‌సార‌థులు మాయావతి - అఖిలేష్ యాద‌వ్‌ వెల్లడించారు. అయితే, ఈ నిర్ణ‌యం వెనుక జ‌రిగిన ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌ను రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) - సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) మళ్లీ 25 ఏళ్ల తర్వాత కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే.. నేడు లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు పొత్తు కుదుర్చుకున్నారు.

1993 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కలిసి పోటీ చేయగా 176 సీట్లు వచ్చాయి. ఆ నాడు పొత్తును కాన్షీరామ్-ములాయం సింగ్ క‌ల‌సి కుదుర్చుకున్నారు. భారతీయ జనతా పార్టీకి 177 స్థానాలు వచ్చాయి. అయితే మెజార్టీకి 213 సీట్లు(ఉత్తరాఖండ్ ఏర్పాటుకు ముందు మొత్తం 424 సీట్లు) అవసరం కాగా జనతాదళ్ 27 - కాంగ్రెస్ 28 - వామపక్షాలకు వచ్చిన 4 సీట్ల మద్దతుతో ఎస్పీ - బీఎస్పీలు కలిసి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో తొలి - చివరి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. అయితే మాయావతి - ములాయం మధ్య ఏర్పడిన విబేధాలతో ఈ ప్రభుత్వం 1995 జూన్ లో(ఏడాదిన్నరకే) కూలిపోవ‌డం గ‌మ‌నార్హం.

అనంత‌రం వ‌చ్చిన 1996 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన అనంతరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ - బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు - బీఎస్పీ నేత కాన్షీరాంతో మాట్లాడి పొత్తు కుదుర్చుకున్నారు. 1993 ఎన్నికల్లో ఎస్పీ- బీఎస్పీ పొత్తుతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 1996 ఎన్నికల్లో బీఎస్పీ 296 స్థానాల్లో పోటీ చేయగా 67 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 126 సీట్లకు పోటీ చేసి 33 సీట్లను గెలిచింది. భారతీయ జనతా పార్టీ 174 సీట్లతో మొదటి స్థానంలో నిలవగా - 110 సీట్లతో ఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి బీఎస్పీ చివరికి బీజేపీ మద్దతుతో మాయావతిని రెండోసారి సీఎం పీఠంపై కూర్చున్నారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకోలేదు. ఇక 1993లో ఎస్పీ - బీఎస్పీ కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, మరోసారి ఇప్పుడు ఒక్కటై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సైకిల్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని క‌మ‌లానికి షాక్ ఇవ్వాల‌నుకుంటున్న ఈ పార్టీల ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో తేలాలంటే, మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే.