Begin typing your search above and press return to search.

దాయాదికి దిమ్మ తిరిగే పంచ్ పడింది

By:  Tupaki Desk   |   28 Sep 2016 5:52 PM GMT
దాయాదికి దిమ్మ తిరిగే పంచ్ పడింది
X
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. తన స్వార్థం కోసం హింసను ప్రేరేపించే పాడు పాకిస్థాన్ ను ప్రపంచంలో ఏకాకిగా చేస్తానంటూ ప్రధాని మోడీ చెప్పిన మాటకు తగ్గట్లే తాజాగా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. పాకిస్థాన్ ఎన్నికల్లో మోడీ పోటీ చేయబోతున్నారా? అంటూ కాంగ్రెస్ వేసిన వ్యంగ్య విమర్శల్లో ఏ మాత్రం అర్థం లేదన్న విషయం స్ఫష్టం కావటమే కాదు.. పాకిస్థాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఎవరి విషయంలోనూ అనవసరంగా జోక్యం చేసుకోకుండా.. తన దారిన తాను ఉండే భారత్ తో పెట్టుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్నది పాక్ కు అర్థం కావటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భారత్ కున్న పరిపతి ఏమిటన్న విషయాన్ని అందరికి అర్థమయ్యే పరిస్థితి.

అంతర్జాతీయంగా పాక్ ను ఏకాకిని చేయాలన్న ప్రయాణంలో తొలి మజిలీని మోడీ దిగ్విజయంగా పూర్తి చేసినట్లే. నవంబరులో పాక్ లోని ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ సదస్సు రద్దు అయ్యింది. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో భారత్ సార్క్ సమావేశానికి హాజరు కాకూడదని ప్రధాని మోడీ నిర్ణయించిన నేపథ్యంలో.. భారత్ బాటలో బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్థాన్.. భూటాన్.. దేశాలు సదస్సుకు హాజరు కాలేమని తేల్చేశారు. దీంతో.. సార్క్ దేశాలకు నేతృత్వం వహిస్తున్న నేపాల్ సార్క్ సదస్సును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో.. పాక్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో.. పాక్ తీరుపై మోడీ సర్కారు సీరియస్ కావటమే కాదు.. దాయాదికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలన్న ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మోడీ కదిపిన పావులు సత్ఫలితాన్ని ఇవ్వటమే కాదు.. భారత్ కు నైతిక మద్దుతు ఇవ్వటంలో సార్క్ దేశాలు వెన్నంటి ఉండటం పాక్ కు భారీ దెబ్బగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.