Begin typing your search above and press return to search.

అమెరికా అంతకంటే క్రూరమైనదే

By:  Tupaki Desk   |   2 Aug 2015 7:33 AM GMT
అమెరికా అంతకంటే క్రూరమైనదే
X
అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యావేత్త ఒకరు చేసిన వ్యాఖ్య ఇప్పుడు అమెరికాను కుదిపేస్తోంది. అంతేకాదు... అమెరికా, ప్రపంచవ్యాప్తంగా చర్చకు కూడా దారితీస్తోంది. న్యూజెర్సీలో రుటాగార్స్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దీపా కుమార్ ఇప్పుడు అమెరికాలో సంచలన వ్యక్తిగా మారిపోయారు... ''ఐఎస్ ఐఎస్ చాలా క్రూరమైనది.. ఒప్పుకొంటాను... కానీ, అమెరికా అంతకంటే క్రూరమైనదే. ఇరాక్, ఆఫ్ఘన్, పాక్ లలో 13 లక్షల మంది ప్రాణాలు తీసింది'' అంటూ ఆమె ట్విట్టర్ చేసిన కామెంట్ అత్యంత వివాదాస్పదంగా మారింది.

అయితే... ఆమె ఈ కామెంట్ ఇప్పుడు చేయలేదు... నాలుగు నెలల కిందట ఆమె చేసిన కామెంటుపై ఓ ఛానల్ కథనం ప్రసారం చేయడంతో తాజాగా వివాదమై కూర్చుంది. నిజానికి దీపాకుమార్ మార్చి 26న ఈ ట్వీట్ చేశారు. దీనిపై ఫాక్స్ న్యూస్ స్పెషల్ స్టోరీ వేసింది. దీంతో అమెరికన్లు కొందరు దీపాపై తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేశారు.. అమెరికా అంత క్రూరమైనదైనప్పుడు అమెరికాలో ఎందుకున్నావంటూ దీపాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అమెరికాను వీడిపోవాలంటూ ఆగ్రహించారు.

ఇంతకీ దీపాకుమార్ బ్యాక్ గ్రౌండేమిటా అని ఆరాతీస్తే... ఆమె ఉదారవాద, కొంత వామపక్ష భావాలున్న మహిళ. బెంగళూరులో బి.ఎ. చదివారు. ఆ తరువాత అమెరికా వెళ్లి అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. పలు పుస్తకాలూ రాశారు. ఇస్లాం ఫోబియా అండ్ ద పాలిటిక్స్ ఆఫ్ ఎంపైర్ , అవుట్ సైడ్ ద బాక్స్ వంటి పుస్తకాలు రాసిన ఆమె ఈ వివాదాన్ని.. దీనిపై ఆమె పట్ల వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తున్నారు. ఉన్నదున్నట్లు మాట్టాడితే అంతే అని తేలిగ్గా తీసిపారేశారు.