Begin typing your search above and press return to search.

ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లను అభివృద్ధి చేస్తున్న బీహార్ సీఎం

By:  Tupaki Desk   |   30 April 2016 9:30 AM GMT
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లను అభివృద్ధి చేస్తున్న బీహార్ సీఎం
X
ఏ రాష్ట్రం ఆదాయంలోనైనా ఎక్కువగా ఎక్కువగా ఎక్సయిజ్ - రెవెన్యూ రాబడులదే కీలక పాత్ర. కొన్ని చిన్నచిన్న రాష్ట్రాలు - ఇతర వనరులు ఉన్నవి పర్యాటకమో.. గనులపైనో ఆధారపడతాయి. జానాభా - విస్తీర్ణం బాగా ఉన్న రాష్ట్రాలు మాత్రం ఎక్సయిజ్ - రెవెన్యూ ఆదాయాలను నమ్ముకుంటాయి. అందుకే చాలా రాష్ట్రాలు మద్య నిషేధం అన్న మాట వింటేనే హడలిపోతాయి. మద్య నిషేధం విధిస్తే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని తెలుసు కాబట్టే ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతాయి. కానీ.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం ఆ రాష్ట్రంలో మద్య నిషేధం విధించారు. దానివల్ల బీహార్ రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం తగ్గి పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ - జార్ఖండ్ లకు దశ తిరుగుతోంది. బీహార్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ - జార్ఖండ్ రాష్ట్రాల్లోని మద్యం దుకాణాల్లో సేల్సు 3 వేల రెట్లు పెరిగాయట. అంటే రూపాయి ఆదాయం వచ్చే చోట 3000 రూపాయల ఆదాయం వస్తోందన్న మాట.

3 వేల శాతం విక్రయాలు పెరిగాయంటే నమ్మశక్యంగా లేకపోయినా యూపీలో ఎక్సయిజ్ శాఖ చెబుతున్న లెక్కలు చూస్తే ఇది నమ్మాల్సిందే. బీహార్ సరిహద్దులోని యూపీ జిల్లా బల్లియాలోని భరౌలీ గ్రామానికి చెందిన ఓ మద్యం షాపులో విక్రయాలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయట. పొరుగు రాష్ట్రం బీహార్ నుంచి జనం వచ్చి ఆ షాపును కొల్లగొట్టినంత పనిచేస్తున్నారట. ఈ కారణంగా ఒక్క నెలలోనే ఆ షాపులో సేల్స్ 1500 శాతం పెరిగిందట. చందౌలీలోని భావ్ రాహా గ్రామానికి చెందిన మద్యం దుకాణంలో విక్రయాలు ఏకంగా 3 వేల శాతానికి పెరిగాయట.

సరిహద్దుల్లోని మిగతా దుకాణాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయట. దాంతో వాటినుంచి సరకు కావాలంటూ ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. ఉదయం లారీ సరుకు పంపితే మధ్యాహ్నానికే మళ్లీ ఇంకో లారీ కావాలని ఆర్డరు చేస్తున్నారట. మామూలుగా రోజుకు కేసు బీరు అమ్ముడు పోయే చిన్న దుకాణాల్లో కూడా ఇప్పుడు లారీలకు లారీల సరకు సేల్ అవుతోందట. మొత్తానికి బీహార్ లో మద్య నిషేధం వల్ల యూపీ - బీహార్ లోని వైన్ షాపులు - ప్రభుత్వాల పంట పండుతోంది.