Begin typing your search above and press return to search.

రోజా నిరస‌న‌కు బాబు అవాక్క‌వ్వాల్సిందే

By:  Tupaki Desk   |   19 Sep 2018 1:32 PM GMT
రోజా నిరస‌న‌కు బాబు అవాక్క‌వ్వాల్సిందే
X
ఫైర్‌ బ్రాండ్ నాయ‌కురాలు - వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోమారు త‌న‌దైన శైలిలో ఏపీ స‌ర్కారును క‌ల‌వ‌రపాటుకు గురి చేశారు. సీఎం చంద్ర‌బాబు ప‌రిపాల‌న తీరును చాటి చెప్పేందుకు ఆయ‌న సొంత జిల్లా అయిన చిత్తూరులోనే వినూత్న రీతిలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఏపీలోని రోడ్ల పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలపడం కోసం వైసీపీ ఎమ్మెల్యే రోజా వినూత్నంగా నిరసనను తెలిపారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లపై రోజా నాట్లు వేశారు. ఈ రోజు రోజా చిత్తూరు జిల్లా మేళపట్టు గ్రామానికి చేరుకుని బురదమయంగా మారిన రోడ్లపై నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ గ్రామంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇదే విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు తెలప‌డంతో ప్ర‌జ‌ల దృష్టికి వారి ఆవేద‌న‌ను చేర‌వేసేందుకు ఈ ర‌కంగా నిర‌స‌న తెలిపిన‌ట్లు ఎమ్మెల్యే రోజా వెల్ల‌డించారు.

రోజా ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో రహదారులు అన్ని దారుణంగా ఉంటే.. మంత్రి లోకేష్‌ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేక సార్లు రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని రోజా మండిపడ్డారు. బురదమయంగా మారిన రోడ్లపై నాట్లు వేసిన తీరుతో అయినా..ప్ర‌భుత్వానికి క‌నువిప్పు క‌ల‌గాల‌ని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్రప్ర‌భుత్వం ప్ర‌చార యావ త‌గ్గించుకొని...ప్ర‌జాహిత ప‌నుల‌పై దృష్టిపెట్టాల‌ని ఆమె కోరారు.