Begin typing your search above and press return to search.

నాడు వ్య‌వ‌సాయం దండ‌గ‌...నేడు పండ‌గా?

By:  Tupaki Desk   |   25 Sep 2018 3:51 PM GMT
నాడు వ్య‌వ‌సాయం దండ‌గ‌...నేడు పండ‌గా?
X
ఐక్యరాజ్యసమితిలో వ్య‌వ‌సాయం - ప్ర‌కృతి సేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించేశారంటూ ఎల్లో మీడియా విప‌రీత‌మైన ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, న్యూయార్క్‌ లో జ‌రుగుతోన్న `వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం` అనే స్వచ్ఛంద సంస్థ.. `బ్లూమ్‌ బర్గ్‌` అనే వాణిజ్య సంస్థతో కలిసి నిర్వహించే సమావేశానికి చంద్ర‌బాబు వెళ్లార‌ని....అస‌లు ఐరాస లో చంద్ర‌బాబు ప్ర‌సంగం లిస్ట్ కాలేద‌ని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించిన విష‌యం విదిత‌మే. ఐరాస ఆహ్వానాన్ని చంద్ర‌బాబు మీడియా ముందు బ‌య‌ట‌పెట్టాల‌ని జీవీఎల్ తో పాటు ప‌లువురు నెటిజ‌న్లు ట్రోల్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఐరాస వ్య‌వహారంపై వైసీపీ ఎంపీ రోజా సెటైర్లు వేశారు. గ‌తంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు అమెరికాలో వ్యవసాయంపై స్పీచ్ లు ఇస్తాన‌ని ప్ర‌చారం చేయ‌డం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. రైతులంటే చిన్న చూపు ఉన్న చంద్ర‌బాబు ....సేద్యం గురించి మాట్లాడ‌డం హాస్యాస్పద‌మ‌ని రోజా కామెంట్స్ చేశారు.

అరకు దివంగ‌త ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌రరావుకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని చంద్ర‌బాబు....ప్ర‌జ‌ల‌కు ఏం క‌ల్పిస్తార‌ని రోజా మండిప‌డ్డారు. ఎమ్మెల్యే ప్రాణానికి రక్షణ లేనిచోట - సామాన్య ప్ర‌జ‌లు - మ‌హిళ‌ల‌కు రక్షణ ఎలా ఉంటుంద‌ని రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీలో ఎవ‌రికీ రక్షణ లేదని - చంద్ర‌బాబు పాల‌నలో మ‌హిళలకు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అపూర్వ స్పంద‌న వ‌స్తోంద‌ని, ఆయ‌న పాద‌యాత్ర 3000 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకొని ఓ జ‌న ప్రభంజనంలా సాగుతోందని హ‌ర్షం వ్యక్తం చేశారు. జ‌న‌నేత జ‌గ‌న్ అడుగులో అడుగేసుకుంటూ జ‌నం న‌డుస్తుంటే ప్ర‌కాశం బ్యారేజీ గడగడలాడిందనీ - గోదారి తీరం ఉప్పొంగిందనీ - విశాఖ తీరం పోటెత్తిందని అన్నారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా జగన్‌ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నార‌ని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌గ‌నే సీఎం అని అన్నారు.