Begin typing your search above and press return to search.

బాబూ... మ్యానిఫెస్టో మాటేమిటి....!

By:  Tupaki Desk   |   15 July 2018 2:22 PM GMT
బాబూ... మ్యానిఫెస్టో మాటేమిటి....!
X
మ్యానిఫెస్టో ఏ పార్టీకైనా భగవద్గీత వంటిది. మ్యానిఫెస్టో ఏ పార్టీకైనా ఖురాన్ వంటిది. మ్యానిఫెస్టో ఏ పార్టీకైనా బైబిల్ వంటిది. అంత పవిత్రమైన మ్యానిఫెస్టోను కూడా ఆంధ్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీ తుంగలో తొక్కుతోంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా నెరవేరుస్తారో తెలియజేసే ఈ మ్యానిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడమే మానేశారు. నిజానికి ప్రజలు తమకు ఎలాంటి మేలు జరుగుతుంది... ఏ ఏ పార్టీలు తమ కలలను నెరవేరుస్తారు అనే అంశాలపైనే ఆసక్తిగా ఉంటారు. ఆయా రాజకీయ పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోలను బట్టి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి...

ఎవరిని ఓడించాలి అనే అంశాలను నిర్ణయించుకుంటారు. గతంలో ఈ మ్యానిఫెస్టోల రూపకల్పనకు ప్రతీ రాజకీయ పార్టీ ఓ క్రతువు నిర్వహించినట్లుగా చేసేవి. పలు రంగాలకు చెందిన మేథావులు, నిష్ణాతులతో సంప్రదింపులు జరిపి వాటిని పగడ్బందీగా రూపొందించేవి. తమకు చేతకాని, చేయలేని పనులను మ్యానిఫెస్టోలో ఉంచేవి కావు. కాని నేడు ఆ పరిస్ధితి లేదు. అసాధ్యమైన అంశాలను కూడా మ్యానిఫెస్టోలు చేరుస్తూ ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తు వారి నుంచి ఓట్లు పొంది అధికారంలోకి వస్తున్నారు నేటి రాజకీయ నాయకులు.

దీనికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన అధికార పక్షం.. అవి ప్రజలకు గుర్తు లేకుండా చేసేందుకు తమ అధికారిక వెబ్ సైట్ల నుంచి కూడా తొలగిస్తున్నారని ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా మండిపడుతున్నారు. రుణమాఫీపై హమీలు గుప్పించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరవడం మ్యానిఫెస్టో సాక్షిగా నిజమంటున్నారు రోజా. తాము ప్రజలకిచ్చిన హామీలు 90 శాతం నెరెవేర్చామని చెబుతున్న అధికార పార్టీ అసలు వారిచ్చిన హామీలేమిటో తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచారని, వాటిని తిరిగి అధికారిక వెబ్‌సైట్లో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు 90 వేల కోట్లున్న అప్పులు ఇప్పుడు ఏకంగా రెండున్నర లక్షల కోట్లకు ఎందుకు చేరుకున్నాయని ప్రశ్నించారు ప్రతిపక్ష ఎమ్మెల్యే.

కమిషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకున్నారని, వాటర్ స్టోరేజి లేకుండా ముంపు ప్రాంతం ఎలా పెరిగిందన్న కేంద్ర మంత్రి గడ్కరి ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు నీళ్లు నమిలారని ప్రశ్నించారు.