Begin typing your search above and press return to search.

రోజా టీడీపీపై రివెంజ్ తీర్చుకుందా...?

By:  Tupaki Desk   |   20 April 2017 9:53 AM GMT
రోజా టీడీపీపై రివెంజ్ తీర్చుకుందా...?
X
వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు శాసనసభలోకి రానివ్వకుండా ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారు టీడీపీ నేతలు.. పాపం... రోజా ఎంతో ఆవేదన చెందింది. ఇతర పార్టీల వారు కూడా రోజా విషయంలో టీడీపీ వైఖరి కరెక్టు కాదని చెప్పినా కూడా ఆ పార్టీ నేతలు వినిపించుకోలేదు. తనను అంత దారుణంగా అవమానించిన టీడీపీని రోజా ఊరికే వదలలేదట... చంద్రబాబుపై ఇటీవల తీవ్ర ధిక్కార స్వరం వినిపించిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇష్యూలో రోజా హ్యాండ్ ఉందట. టీడీపీ నేతలు ఈ విషయంలో నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.

రోజా హ్యాండ్ ఉంది అనుకోవడానికి పెద్ద రీజనే చెబుతున్నారు. శివప్రసాద్ - రోజా తండ్రి ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఆ స్నేహం కారణంగానే రోజాను చిత్రపరిశ్రమకు శివప్రసాద్‌ పరిచయం చేశారు. శివప్రసాద్‌ ను తండ్రితో సమానంగా రోజా భావిస్తుంటారు. అయితే ఇటీవల శివప్రసాద్‌ వెనుక టీడీపీ నాయకత్వం గోతులు తవ్వడం ప్రారంభించడం.. వచ్చే ఎన్నికల్లో శివప్రసాద్‌ కు టికెట్‌ ఎగొట్టేందుకు టీడీపీ నాయకత్వం నిర్ణయించుకోవడం ఆయనకు, రోజాకు కూడా తెలిసిందట. ఎస్వీ యూనివర్శిటీ వీసీ ఆవుల దామోదరానికి చిత్తూరు ఎంపీ టికెట్‌ ను చంద్రబాబు ఖాయం చేశారని తెలిసి కొంతకాలంగా శివప్రసాద్‌ చాలా అసంతృప్తితో ఉన్నారట.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రోజా శివప్రసాద్‌ తో చర్చలు జరిపారు. అనంతరం జగన్‌కు కూడా శివప్రసాద్‌ పరిస్థితిని రోజా వివరించారు. మీరు ఓకే అంటే శివప్రసాద్‌ వైసీపీలోకి వస్తారని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారట. శివప్రాసద్ చురుకైన నేత కావడంతో జగన్‌ నుంచి కూడా సానుకూలత వ్యక్తం అయిందట. వెంటనే ఆ విషయాన్ని శివప్రసాద్‌ కు రోజా చేరవేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్‌ పై హామీ రావడంతోనే శివప్రసాద్‌ ధైర్యంగా జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సామాన్య కిరణ్‌ ను ఇప్పటికే సంతనూతలపాడు నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా నియమించడంతో అక్కడ శివప్రసాద్ టిక్కెట్ కు ఢోకా లేదని చెబుతున్నారు.

ఇదంతా పూర్తయిన తరువాత శివప్రసాద్ ధైర్యంగా గొంతెత్తడంతో చంద్రబాబు సహా నేతలంతా షాకయ్యారు. ఇంత ధైర్యం శివప్రసాద్‌ కు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీసిన టీడీపీ నాయకత్వానికి రోజా చక్రం తిప్పినట్టు తెలిసిందట. దీంతో టీడీపీ నాయకత్వం రోజాపై మరోసారి రగిలిపోతోంది. అయితే రోజా రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేశారా.. లేదంటే తండ్రి స్నేహితుడు కావడంతో శివప్రసాద్ కు అండగా నిలిచారా అన్నది తెలియాలి. ఏదైనా కానీ... టీడీపీ వారు మాత్రం రోజాను చూసి మరింత భయపడుతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/