Begin typing your search above and press return to search.

రోజా ఘాటు వ్యాఖ్య‌!... బాబు నీరో చ‌క్ర‌వ‌ర్తి

By:  Tupaki Desk   |   17 Oct 2017 11:30 AM GMT
రోజా ఘాటు వ్యాఖ్య‌!... బాబు నీరో చ‌క్ర‌వ‌ర్తి
X
వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మ‌రో సారి రెచ్చిపోయారు. సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు గంటా శ్రీనివాస‌రావు - పి.నారాయ‌ణ‌ల‌కు రేవు పెట్టేశారు. ఇటీవ‌ల కాలంలో ఏపీలోని నారాయ‌ణ విద్యా సంస్థ‌లు స‌హా కార్పొరేట్ కాలేజీల్లో జ‌రుగుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను ఆమె ప్ర‌స్థావించారు. ఇంత మంది విద్యార్థులు ఒత్తిళ్లు త‌ట్టుకోలేక పోతున్నామంటూ ప్రాణాలు కోల్పోతున్నా ప‌ట్టించుకోరా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సెక్ర‌టేరియ‌ట్‌ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎవ‌రో త‌న ఫొటోపై ఎంగిలి ప‌ళ్లారు పెట్టార‌ని ఆ ఘ‌ట‌న‌పై ఐఏఎస్ తో విచార‌ణ‌కు ఆదేశించిన సీఎం చంద్ర‌బాబు.. ఇంత మంది లేలేత మొగ్గ‌లు రాలిపోతుంటే ప‌ట్టించుకోకుండా నీరో చ‌క్ర‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తారా? అని ప్ర‌శ్నించారు.

హైదరాబాదులోని వైసీపీ కేంద్ర‌ కార్యాలయంలో రోజా మాట్లాడుతూ, విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్యార్థులు చ‌నిపోయిన‌ కాలేజీపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి కారణమైన నారాయణ - చైతన్య కాలేజీల యాజమాన్యాలకు ఏ శిక్షలు విధించారని నిల‌దీశారు. 48 మంది విద్యార్థులు ఈ కాలేజీల్లో మరణిస్తే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కనీసం పట్టించుకోలేదని విమ‌ర్శించారు. కేవలం వియ్యంకుడన్న కారణంతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. మంత్రి నారాయణను రక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు. 48 మంది పిల్లలు మరణిస్తే మంత్రి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? అని ఆమె ప్రశ్నించారు.

కేవలం సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోపై సెక్ర‌టేరియ‌ట్‌ లో చెత్త వేశారన్న దానిపై ఐఏఎస్ అధికారిణితో విచారణకు ఆదేశించారే?... పిల్లల జీవితాలను హరిస్తున్న నారాయణ - చైతన్యలపై విచారణకు ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేశారని ఆమె ప్రశ్నించారు. తక్షణం మంత్రి వర్గం నుంచి గంటా - నారాయణలను సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఊరు త‌గ‌ల‌బ‌డుతున్నా.. ఫిడేల్ వాయించిన నీరో చ‌క్ర‌వ‌ర్తిలాగా చంద్ర‌బాబు ఏపీలో పాల‌న సాగిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఒక‌ప‌క్క విద్యార్థులు చ‌నిపోతుంటే.. స‌మీక్ష‌ల‌తో కాల హ‌రణం చేయ‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లింద‌ని అన్నారు. మొత్తానికి రోజా కామెంట్లు మ‌రోసారి పొలిటిక‌ల్‌ గా హీట్ పెంచాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.