Begin typing your search above and press return to search.

బాలకృష్ణ ‘గాలి’ తీసేసిన రోజా

By:  Tupaki Desk   |   18 Aug 2017 4:43 PM GMT
బాలకృష్ణ ‘గాలి’ తీసేసిన రోజా
X
నంద్యాల ఎన్నికల సందర్భంగా నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే - ప్రముఖ సినీనటుడు బాలకృష్ణపై ఆమె చేసిన పదునైన వ్యాఖ్యలు అక్కడున్నవారిని ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారిపోయాయి.

రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ ‘‘ఫ్యాన్(వైసీపీ గుర్తు) గట్టిగా వీస్తోంది.. అందుకే తన విగ్ ఎగిరిపోతుందని బాలకృష్ణ పారిపోయాడు’’ అని రోజా విమర్శించారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల క్రితం టీడీపీ నిర్వహించిన రోడ్ షో లో బాలకృష్ణ పాల్గొని ఆ తరువాత మళ్లీ కనపడకపోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా బాలకృష్ణ తన పర్యటనలో దురుసుగా బిహేవ్ చేసిన నేపథ్యంలో ఆయన ప్రచారం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని భావించి టీడీపీ అతణ్ని ప్రచారం నుంచి తప్పించినట్లు చెప్తున్నారు.

కాగా రోజా తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘బ్రిటిష్ వాళ్ల కన్నా మనల్ని ఘోరంగా మోసం చేసిన చంద్రబాబునాయుడుకి ఓటర్లు కొట్టే దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి. ఫ్యాన్ లోపల ఉంటుంది. సైకిల్ బయట ఉంటుంది. మనకు ఎప్పుడు పని వచ్చినా శిల్పా మోహన్ రెడ్డి గారు పక్కనే ఉంటారు. బ్రహ్మానందరెడ్డి ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు!. కాబట్టి, ఎంత తిరిగినా ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేస్తేనే చల్లగా ఉంటుంది. 2019లో మనం అధికారంలోకి రాబోతున్నాం.. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోబోతున్నాం. దానికి నాందిగా ఈ రోజు జరిగే ఈ ఉపఎన్నికల్లో నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ‘అబ్బా’ అనిపించేలాగా.. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి.’’ అంటూ ఆమె జనానికి పిలుపునిచ్చారు.