Begin typing your search above and press return to search.

అన్నదాతలకు నెత్తిన పిడుగేసిన కృష్ణా బోర్డు

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:49 AM GMT
అన్నదాతలకు నెత్తిన పిడుగేసిన కృష్ణా బోర్డు
X
తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతకు పెద్ద కష్టమే వచ్చి పడింది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతుల ఆశల మీద కృష్ణా యాజమాన్య బోర్డు పెద్ద పిడుగేసింది. వర్షాల జాడ తెలుగు రాష్ట్రాల్లో లేకపోవటం.. జలశయాల్లోని నీటి మట్టం అంతకంతకూ అడుగంటిపోవటం.. రెండు రాష్ట్రాల్లో సాగునీటి కోసం రైతుల డిమాండ్లు పెరగటం.. ప్రభుత్వాత ఒత్తిడి అంతకంతకూ పెరుగుతున్ననేపథ్యంలో సమావేశమైన బోర్డు.. సాగుకు నీళ్లు ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసింది.

తాగు నీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేయాలని చెప్పింది. దీంతో.. శ్రీశైలం.. నాగార్జునసాగర్ ల నుంచి సాగునీటి విడుదల సాధ్యం కాదని తేల్చేశారు. కొంతలో కొంత నయం ఏమిటంటే.. శ్రీశైలం రిజర్వాయర్ లో 30 టీఎంసీల నీరు ఉన్న నేపథ్యంలో 8 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇక.. సాగర్ లో నీటి మట్టం 510 అడుగుల మేరకే ఉండటంతో.. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం దాన్ని అలానే కొనసాగించాలని చెప్పింది. అయితే.. తాగునీటి అవసరాల కోసం 1.5 టీఎంసీలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటి నుంచి సెప్టెంబరు రెండో వారం వరకూ అవసరమయ్యే అవసరాలకు ఆధారంగా నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

ఈ నేపథ్యంలో.. కృష్ణా ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదలవుతాయన్న అంచనాతో పంట వేసిన అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోయి.. పెట్టిన పెట్టుబడి మొత్తం భూమిలో కలిసిపోవటంతో.. అన్నదాతలు తీవ్ర నిరాశ.. నిస్పృహలో ఉన్నారు. ఇక.. భూముల్ని కౌలుకు తీసుకున్న వారి పరిస్థితి అయితే వారి వేదనను మాటల్లో చెప్పలేని దుస్థితి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాత పరిస్థితి దారుణంగా మారింది.