Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆస్తులు రూ.332 కోట్లు

By:  Tupaki Desk   |   30 April 2016 4:24 PM GMT
ఆ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆస్తులు రూ.332 కోట్లు
X
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డ‌బ్బు ప్ర‌వాహంలాగా వెల్లువెత్తుతోంది. శుక్రవారంతో నామినేషన్‌ దాఖలు ప్రక్రియ పూర్తయినప్ప‌టికీ భారీ సంఖ్య‌లో అభ్యర్థులుండ‌టంతో అఫిడవిట్లను కంప్యూటరీకరించడంలో ఆల‌స్య‌మైంది. బ‌రిలో నిలిచిన వారి లెక్క‌లు తీస్తే ఆస‌క్తిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగుచూశాయని అధికారులు చెప్తున్నారు. బ‌రిలో ఉన్న‌వారిలో 25 శాతం మంది కోటీశ్వరులే పోటీ చేస్తున్నట్లు స్పష్టమవుతోందని వారు వివ‌రించారు. నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో అత్యంత సంపన్నుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త - వసంత్‌ అండ్‌ కో అధినేత వసంత్‌ కుమార్‌ నిలిచారు. ఏకంగా రూ.332 కోట్ల ఆస్తి ఉన్నట్లు ఆయన తన అఫిడవిట్‌ లో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వసంత్‌ కుమార్‌ నాంగునేరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల అధికారికి నామినేషన్‌ ను సమర్పించిన ఆయన ఆస్తి వివరాల అఫిడవిట్‌ను అందజేశారు. తనకు మొత్తం రూ.332.27 కోట్ల స్థిర - చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు రూ.122.53 కోట్ల అప్పులు కూడా ఉందని ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన వసంత్‌ అండ్‌ కో షాపుల ఆదాయం ఆధారంగా ఆయన తన ఆస్తుల జాబితాను రూపొందించారు.

ఇదిలాఉండ‌గా అన్నాడీఎంకే మంత్రుల ఆస్తులు ఈ అయిదేళ్లలో భారీగానే పెరిగాయి. నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో ఈ విషయం తేలింది. ప్రస్తుతానికి ఈ మంత్రుల విషయంలో వలర్మతి మాత్రం ముందున్నారు. ఆమె ఆస్తులు ఈ ఐదేళ్లలో ఏకంగా రూ.5.58 కోట్ల మేర పెరిగాయి. ఇక ఎడప్పాడి పళనిస్వామి ఆస్తి రూ.4 కోట్లు అధికమైంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న 20 మంది మంత్రులకు ‘అమ్మ’ అనుగ్రహం కలగడంతో వారికి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. గత ఐదేళ్లలో వీరి ఆదాయాన్ని చూసి త‌మ‌కే ఆశ్చర్యమేసిందని అధికారులు అంటున్నారు. వారు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల ప్ర‌కారం మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం ఆస్తుల్లో రూ.50 లక్షల పెరుగుదల క‌నిపించింది. వ‌ల‌ర్మతి రూ.5.56 కోట్ల రూపాయ‌లు పళనిస్వామి: రూ.4.13 కోట్లు పెరుగుదలను చూపించారు. ఇత‌ర మంత్రులు సంపత్‌ 2.52 కోట్లు - కామరాజ్ రూ.1.24 కోట్ల అధికం, నత్తం విశ్వనాథన్ రూ. కోటి మేర ఆస్తులు పెరిగిన‌ట్లు అఫిడ‌విట్ లో తెలిపారు.