Begin typing your search above and press return to search.

అమెరికా ఆర్మీ కంటే టీడీపీ గొప్ప‌ద‌ట‌

By:  Tupaki Desk   |   28 Oct 2016 10:21 AM GMT
అమెరికా ఆర్మీ కంటే టీడీపీ గొప్ప‌ద‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై దూకుడుగా విమ‌ర్శ‌లు చేయ‌డం ముందుండే టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి త‌న రూటు మార్చుకున్నారు. అంటే విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌క్క‌న పెట్టార‌ని అనుకునేరు. కాదు. విమ‌ర్శ‌ల ప‌ర్వం జోరు త‌గ్గిస్తూ తెలంగాణ‌లో పార్టీ నిర్మాణంపై దృష్టిపెడుతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో శ్రేణుల‌కు వివ‌రిస్తున్నారు. సొంత జిల్లా మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రేవంత్ మాట్లాడుతూ ఇదే రీతిలో వివరించారు. ఈ క్ర‌మంలో ఏకంగా అమెరికాకు పోలిక పెట్టేసిన రేవంత్ రెడ్డి అగ్ర‌రాజ్యం ఆర్మీ కంటే టీడీపీ నాయ‌కులే అధిక సంఖ్య‌లో ఉన్నార‌ని వివ‌రించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి లీడర్లు వెళ్లిపోయారని కార్యకర్తలు - ప్రస్తుతం ఉన్న నాయకులు కూడా నిరుత్సాహపడడం సమంజసం కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీకి మోసం చేసి వెళ్లిపోయిన నాయకులు ఎవరు కూడా బాగుపడలేదని అభిప్రాయపడ్డారు. మహబూబ్ న‌గ‌ర్ జిల్లాలో పార్టీ నుంచి వెళ్లిపోయిన జైపాల్ యాదవ్ - నాగం జనార్ధన్ రెడ్డి - రాములు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని, వారి పరిస్థితి ఏమిటో అందరికీ అర్థం అవుతునే ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు. కష్టాలు ఉన్నప్పుడే గట్టిగ నిలబడి కలబడి గెలిచే ప్రయత్నం చేసే వాళ్లే మొనగాళ్లని టీడీపీ కార్యకర్తలు - నాయకులు అలాంటి మొనగాళ్లేనని తాను నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో 10 లక్షల మంది సభ్యులు ఉన్నారని - పార్టీ మొత్తం 54 లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారని వెల్లడించిన రేవంత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భావించే అమెరికా సైనిక సామ‌ర్థ్యం 50 లక్షల మాత్రమే అని పేర్కొంటూ వారికంటే మరో 4 లక్షల మంది అధికంగా టీడీపీలో క్రీయశీలక సైనికులు ఉన్నారని అభివర్ణించారు. టీడీపీ కార్యకర్తలు యూఎస్ ఆర్మికంటే శక్తివంతులని రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. ఇంత పెద్ద సంఖ్య‌లో ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామాలకు తరలి వెళ్లాలని ప్రతి గ్రామంలో వెళ్లగానే కనిపించేలా తెలుగుదేశం పార్టీ జెండాలను ఎగుర వేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

గతంలో గ్రామ - గ్రామాన టీడీపీ జెండా దిమ్మెలు ఉండేవని అయితే, కొందరు సన్నాసులు పార్టీ నుంచి వెళ్లిపోతూ పార్టీ జెండ దిమ్మెల రంగులను కూడా మార్చివేశారని రేవంత్ మండిప‌డ్డారు. అలాంటి సన్నాసులందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదేన‌ని అన్నారు. టీడీపీ కార్యకర్తలు - నిబద్దత - నిజాయితి కలిగిన వారని పేదల కోసం పని చేసే వారన్నారు. అయితే టీఆర్ ఎస్ కార్యకర్తలు దొంగలకు - కబ్లాకోరులకు - స్మగ్లర్లకు రక్షణ ఇచ్చే సన్నాసులని విమ‌ర్శించారు. గ్రామాలకు వెళ్లే టీడీపీ నాయకులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చొని గ్రామస్తులతో మాట్లాడాలని - వ్యవసాయం - కుల వృత్తులు ఎవరి హయాంలో బాగుండేవనే విషయం వారికి గుర్తు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. టీడీపీ హయాంలో దళిత కాలనీలు - గిరిజన తండాలు పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పిస్తే ప్రస్తుతం కేసీఆర్ తండాలు - కాలనీలలో ఉన్న పాఠశాలలను కూడా సంఖ్య బలం లేదన్న కారణంగా మూసివేస్తున్నారని విమర్శించారు. 'గ్రామంలో కూర్చొండి. రోడ్డు చూపించి దానిని ఎవరు వేశారో అడగండి. బడి చూపండి. దానిని ఎవరు కట్టించారో అడగండి. నీళ్ల ట్యాంకు చూపించండి దానిని ఎవరు కట్టారో అడగండి. . ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు ఎవరు వేయించారో. అంగన్ వాడి భవనాలను ఎవరు కట్టారో. అగడండి. అంతా చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్న విషయం అందరికీ గుర్తు చేయండి. ఇప్పుడు కష్టాల్లో ఉన్న మీకు మేము తోడుంటామని హామీ ఇవ్వండి. ఉపాధి హామీ కూలీలు వచ్చాయా? ఫీజు రీయింబర్స్ మెంట్ అందిందా? ఆరోగ్య శ్రీలో చికిత్సలు జరుగుతున్నాయా అని వారిని పరామర్శించండి. ప్రస్తుతం పేదలు తమ కష్టాలు వినే నాధుడు లేక ఎవరు తమ గోస వినడానికి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. వారికి దైర్యం చెప్పండి. పేదలకు అండ పసుపు జెండా అని చాటి చెప్పండి.” అని రేవంత్ పార్టీ శ్రేణులకు భోదించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/