Begin typing your search above and press return to search.

కేసీఆర్ మోసాల‌న్నీ బ‌య‌ట‌పెడ్తానన్న రేవంత్‌

By:  Tupaki Desk   |   24 Aug 2016 4:25 PM GMT
కేసీఆర్ మోసాల‌న్నీ బ‌య‌ట‌పెడ్తానన్న రేవంత్‌
X
మహారాష్ట్రతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసుకున్న ఒప్పందంలోని నిజానిజాల‌ను - ఇప్ప‌టివ‌ర‌కు కేసీఆర్ చేసిన మోసాల‌ను బ‌య‌ట‌పెడ్తాన‌ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. కేవలం కేసీఆర్ ధనదాహం తీర్చుకోవడానికి - భేతాల మాంత్రికుడు కేవీపీకి చెందిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడానికి మాత్రమే ఈ ఒప్పందం జ‌రిగింద‌ని రేవంత్ ఆరోపించారు. మహారాష్ట్ర ముందు కేసీఆర్ మోకరిల్లి చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా తెలంగాణకు ఎనలేని నష్టం జరుగుతుందని, 50 వేల కోట్ల ఆదనపు భారం తెలంగాణ ప్రజలపై పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. తాము చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను గురువారం బయట పెడుతామని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు చిత్తశుద్ధి ఉంటే తాను ప్రకటించిన ప్రకారంగా తమపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ఆయన సవాల్ విసిరారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ మహారాష్ట్రతో చేసుకొని వచ్చిన ఒప్పందాలపై రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ చేసుకొచ్చిన ఒప్పందం కారణంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్ల నుంచి 148మీటర్లకు తగ్గిపోయిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీసు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రకు చెందిన 1800 ఎకరాల భూములు ముంపున గురవుతాయని అందుకు దాని ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఇప్పడు కేసీఆర్ తన ఒప్పందం ద్వారా ఫడ్నవీసు కోరికను తీర్చారని దీనికోసం తెలంగాణ ప్రజలపై 50 వేల కోట్ల అదనపు భారం మోపారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు ఎత్తును 152 నుంచి 148 మీటర్లకు తగ్గించిన కారణంగా మహారాష్ట్రకు చెందిన ఒక ఎకరా భూమి కూడా ముంపునకు గురి కాదని, ఆలాంటప్పడు తెలంగాణ భూభాగంలో తెలంగాణ నిధులతో నిర్మించుకుంటున్న ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ రెడ్డి నిలదీశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 148 మీటర్లకు తగ్గించడంతో పాటు మేడిగడ్డ వద్ద బ్యారేజీలను నిర్మించుకోవడానికి కూడా ఒప్పందం చేసుకున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో మహారాష్ట్రకు సంబంధించిన 3 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని చెప్పారు. అయితే, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులో 1800 ఎకరాల భూమి మునిగిపోవడానికి ఒప్పుకోని మహారాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టులో 3000 ఎకరాలు మునగడానికి ఎలా ఒప్పకుందని ప్రశ్నించారు. ఇందులో ఎవరి హస్తం ఉందోబయట పెట్టాలని డిమాండ్చేశారు. కేవలం కేవీపీకి చెందిన కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టడం ద్వారా వేల కోట్లు దోచుకోవడానికే ఈ ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు.

దీంతోపాటుగా చనాక - కొరటా బ్యారేజీలను పూర్తిగా తెలంగాణ నిధులతో నిర్మిస్తూ అందులో 20% నీళ్లను మహారాష్ట్రకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యారేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనప్పడు కేసీఆర్ ఏ విధంగా మహారాష్ట్రకు ఇందులో హక్కు కల్పిస్తారని ప్రశ్నించారు. తన ఒప్పందం ద్వారా కేవలం తెలంగాణ రైతులకే కాకుండా మత్స్యకారులకు కూడా కేసీఆర్ ద్రోహం చేశారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులలో చేపలు పట్టుకునే హక్కు మహారాష్ట్ర మత్స్య కారులకు ఇస్తూ 50% వాటా ఇవ్వాలని నిర్ణయించారని, ఎవడబ్బ సొమ్మని కేసీఆర్ ఇలా తెలంగాణ సొమ్మను మహారాష్ట్రకు ధారాదత్తం చేస్తారని రేవంత్ నిలదీశారు. ఈ ఏడాది మార్చి 8న కేసీ ఆర్ మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించడానికి ఒప్పందాలు చేసుకున్నామని చెప్పకున్నారని, మార్చి 9న మహారాష్ట్ర నుంచి వచ్చి గాడిదలు, గుర్రాలపై ఊరేగారని, ఇది అప్పటి పత్రికలలో పతాక శీర్షికల్లో వచ్చిందని గుర్తు చేశారు. అప్పడే ఒప్పందాలు చేసుకొని వచ్చి ఉంటే ఇప్పడు మళ్లీ ఏ ఒప్పందాలు చేసుకున్నార‌ని ప్ర‌శ్నిస్తూ ఒక్క ఒప్పందాన్ని ఎన్ని సార్లు చేసుకుంటావని రేవంత్ ధ్వజమెత్తారు.తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు ఎత్తు విషయంలోనూ, ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ల మార్పిడిలోనూ సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికలను కూడా కేసీ ఆర్ తొక్కిపెట్టారని వాటన్నింటిని తాను రేపు బయట పెడతానని రేవంత్ ప్రకటించారు. ప్రాజెక్టుల విషయంలో ఆరోపణలు చేస్తే కేసులు పెడతానని బెదిరిస్తున్న కేసీఆర్ దమ్మంటే తనపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.