Begin typing your search above and press return to search.

కొత్త వ్యూహం: కాంగ్రెస్ బ‌రిలో రేవంత్‌.. సీత‌క్క‌..?

By:  Tupaki Desk   |   14 March 2019 4:22 AM GMT
కొత్త వ్యూహం: కాంగ్రెస్ బ‌రిలో రేవంత్‌.. సీత‌క్క‌..?
X
తెలంగాణ‌రాష్ట్రాన్ని ఇస్తే చాలు.. తెలంగాణ‌లో తిరుగులేని శ‌క్తిగా కాంగ్రెస్ మారుతుంద‌ని.. ఆ దెబ్బ‌తో త‌మ‌కు ఆ రాష్ట్రంలో తిరుగు ఉండ‌ద‌ని భావించిన ఆ పార్టీ అధినాయ‌క‌త్వానికి గ‌డిచిన ఐదేళ్లుగా ఎదుర‌వుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు ఒక ప‌ట్టాన మింగుడుప‌డని ప‌రిస్థితి. రాష్ట్ర విభ‌జ‌న‌తో తెలంగాణ‌లో భారీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చ‌న్న అంచ‌నాలు అడ్డంగా ఫెయిల్ కావ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను ఎదుర్కొనే శ‌క్తి తెలంగాణ కాంగ్రెస్ లో ఏ ఒక్క‌రికి లేద‌న్న విష‌యాన్ని ఢిల్లీ పెద్ద‌లు కాస్త ఆల‌స్యంగా అర్థం చేసుకున్నారు.

జ‌ర‌గాల్సిన న‌ష్టం భారీగా జ‌రిగిపోయిన నేప‌థ్యంలో.. త‌మ‌కు జ‌రిగిన డ్యామేజ్ ను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం కిందా మీదా ప‌డుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భావం ఎంత‌న్న విష‌యం అర్థం కావ‌ట‌మే కాదు.. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు త‌మ‌కున్న శ‌క్తియుక్తులు స‌రిపోవ‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎదురైన ఘోర అప‌జ‌యంతో నిరాశ‌.. నిస్పృహ‌ల్లోకి లోనైన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ఎత్తుల్ని వేస్తోంది. తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో త‌మ అభ్య‌ర్తుల విష‌యంలో స‌రికొత్త వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వీలైన‌న్ని ఎక్కువ‌చోట్ల గ‌ట్టిపోటీ ఉండేలా అభ్య‌ర్థుల్ని ఫైన‌ల్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కూ తెర మీద‌కు రాని కొత్త పేర్లు కాంగ్రెస్ అభ్య‌ర్థులుగా వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ రంగంలోని లేని కొత్త పేర్ల‌ను తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. కేసీఆర్ కోరుకుంటున్న‌ట్లు 16 ఎంపీ సీట్లు టీఆర్ ఎస్ ఖాతాలో ప‌డ‌కుండా చేయాల్సిందంతా చేయాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బ‌రిలోకి దించేందుకు పార్టీకి చెందిన బ‌ల‌మైన నేత‌ల‌కు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల్ని కేటాయించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండే మ‌ల్కాజిగిరి లోక్ స‌భ స్థానం నుంచి టీపీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బ‌రిలోకి దించితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో పార్టీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీనిపై చ‌ర్చించేందుకు వీలుగా రేవంత్ ను ఢి్ల్లీకి రావాల‌న్న స‌మాచారం అంద‌టంతో ఆయ‌న హ‌డావుడిగా బ‌య‌లుదేరి వెళ్ల‌టం గ‌మ‌నార్హం. అదే విధంగా మ‌హ‌బూబాబాద్ ఎస్టీ స్థానం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ప‌రిశీలించిన బ‌ల‌రాం నాయ‌క్.. బెల్ల‌య్య నాయ‌క్ పేర్ల‌కు బ‌దులుగా సీత‌క్క పేరును తెర మీద‌కు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌హ‌బూబాబాద్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల్ని సొంతం చేసుకుంది. ఈ స్థానాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌లుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇద్ద‌రు ఇటీవ‌ల టీఆర్ ఎస్ లో చేరారు. ఈ నేప‌థ్యంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో స్థైర్యం నింపేందుకు వీలుగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌న్న ఆలోచ‌న‌తో సీత‌క్క పేరును తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

నాగ‌ర్ క‌ర్నూల్ టికెట్ ను సిట్టింగ్ ఎంపీ నంది ఎల్ల‌య్య పేరు దాదాపుగా ఖ‌రారు అయినా.. ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్ కుమార‌త్ రేసులో ఉండేందుకు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. భువ‌న‌గిరి టికెట్ మ‌ధుయాస్కీకి దాదాపుగా క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో నిజామాబాద్ నుంచి ఎన్నారై తిరుప‌తిరెడ్డి పేరును తెర మీద‌కు వ‌చ్చింది. చేవెళ్ల‌కు సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి పేరున ప్ర‌క‌టించాల్సి ఉంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఖ‌మ్మం.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీల‌కు టికెట్ ల‌భించ‌ద‌న్న ప్ర‌చారం జోరందుకున్న వేళ‌.. టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఎవ‌రో స్ప‌ష్ట‌త వ‌చ్చిన త‌ర్వాతే పేర్ల‌ను ప్ర‌క‌టించాల‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారానికి త‌గ్గ‌ట్లుగా టీఆర్ ఎస్ సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ల‌భించ‌ని ప‌క్షంలో వారు కాంగ్రెస్ లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. అదే జ‌రిగితే వారికి టికెట్లు ఇచ్చే ఆలోచ‌న కాంగ్రెస్ కు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ గెల‌వ‌ర‌ని డిసైడ్ అయ్యాక.. అలాంటి వారిని కాంగ్రెస్ త‌న అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దింప‌టం స‌రైన‌దేనా? అన్న చ‌ర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఏమైనా.. ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన చ‌ర్చ‌కు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో స‌రికొత్తగా చ‌ర్చ స్టార్ట్ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.