Begin typing your search above and press return to search.

టీటీడీపీ నేత‌ల‌కు వార్నింగిచ్చిన రేవంత్‌

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:49 PM GMT
టీటీడీపీ నేత‌ల‌కు వార్నింగిచ్చిన రేవంత్‌
X
త‌మ ముందున్న కొత్త ల‌క్ష్యంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చిత్ర‌మైన ప‌రీక్ష‌ను ఎదుర్కుంటున్నారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కొత్త..కొత్త సమస్యలతో ఇబ్బంది ప‌డుతోంది. అదే రీతిలో తాము సైతం అగ్నిప‌రీక్ష‌ను అనుభ‌వించాల్సి వ‌స్తోంద‌ని నాయ‌కులు స‌ణుక్కుంటున్నారు. తెలంగాణ‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలకు కొరకరాని కొయ్యగా మారింది. మోయలేని భారంగా మారింది. ఈ మాట ఒక పట్టాన వారికి ఊపిరి సలపనివ్వడం లేదు. టార్గెట్‌ పెట్టి 45రోజులు గడిచినా లక్ష్యం నెరవేరలేదు. దీంతో అధిష్టానం మరో 15 రోజులు గడువు పెంచింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటివరకు మూడున్నర లక్షలకు మించి తెలంగాణలో సభ్యత్వ నమోదు జరగలేదు. మరో వారంరోజుల్లో ఇచ్చిన గడువు ముగుస్తోంది. ఆ లోగా టార్గెట్‌గా పెట్టిన ఎనిమిది లక్షల సంఖ్య‌ను చేరుకోగ‌ల‌మా అన్న సందేహాలు అగ్రనేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలా ఉంటే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌మ్ముళ్లు తీవ్ర మ‌థ‌నం చెందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజాభిమోదం భారీగానే లభించింది. ఈ ఎన్నికల్లో 15మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అనంతరం పార్టీ నుంచి గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు ఒక్కరు..ఇద్దరు చొప్పున అధికారపార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లు స్పీకర్‌ ప్రకటించిన విషయం విధితమే. ఈ విషయంపై టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విధితమే. తెలంగాణాలో తెలుగుదేశంపార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదును రెట్టింపు చేయాలని ఆయన యోచిస్తున్నారు. సభ్యత్వనమోదు బాధ్యతను జిల్లా కన్వీనర్లకు అప్పగించారు. ఆశించిన మేరకు సభ్యత్వం నమోదు చేయని జిల్లాల్లో `కన్వీనర్ల పదవుల'పోతాయంటూ హెచ్చరించిన విషయం విధితమే. అయితే ఈ వ్యవహారం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైందని అంటున్నారు. పార్టీలోని అంతర్గత కలహాలు సభ్యత్వ నమోదు వ్యవహారంపై ప్రభావం చూపుతున్నాయి. సుమారు 26 నియోజకవర్గాలకు ఇంతవరకు ఇంచార్జీలు లేరు. అలాగే ఇటీవల జిల్లాల పునర్విభజనతో ఏర్పడ్డ 31 జిల్లాలలో నాలుగు జిల్లాలకు ఇతర జిల్లాల పరిధిలోని నాయకులను కన్వీనర్లుగా నియమించారు. దీంతో ఆ జిల్లాల్లోని సీనియర్‌ నేతలు గురగ్రా ఉన్నారు. అలాగే పలుచోట్ల త్రీమెన్‌, పైవ్‌ మెన్‌ కమిటీలు ఏర్పాటుచేశారు. ఇలాంటిచోట్ల సభ్యత్వాలనేవి ఇబ్బందికరంగా మారాయి. నాకు సీటు వస్తుందా? ఆ గ్యారెంటీ ఉంటేనే సభ్యత్వాల సంగతి చూస్తానని'' ఎవరికి వారు భీష్మించుకుని కూర్చున్నారని అంటున్నారు.

ఒకప్పుడు గ్రేటర్‌లో ఓ వెలుగు వెలిగిన టీడీపీకి ఇప్పుడు ఇక్కడ సభ్యత్వం కత్తిమీద సాములా మారింది. కీలకమైన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి,షాద్‌నగర్‌ లాంటి నియోజకవర్గాల్లో సైతం పట్టించుకునే నాథులు లేక సభ్యత్వం సాగడం లేదంటున్నారు. ఈ బాధ్యతలు సీనియర్‌ నేతలకు అప్పగించాలని అధినేత చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టినా దానిపై కదలిక లేదంటున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోయినసారి సుమారు 20 వేల వరకు సభ్యత్వం జరగగా... ప్రస్తుతం ఆ సంఖ్య రెండువేలకు మించలేదు. దీంతో గ్రేటర్‌లో పరిస్థితి ఎలా చక్కదిద్దాలా అని టీ-టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌ - నిజామాబాద్‌ - మెదక్‌ - కరీంనగర్‌ లలో కొంత భాగం సభ్యత్వం విషయంలో పూర్తిగా నీరసించిన పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ లో ఇప్పటివరకు వందమంది మాత్రమే టీడీపీ సభ్యులుగా చేరినట్లు సమాచారం. గతంలో చేపట్టిన సభ్యత్వ నమోదు సందర్భంలో ఇక్కడ సుమారు 18 వేలమంది టీడీపీ సభ్యులుగా ఉన్నారు. తన ఇంట్లో వివాహ శుభకార్యంతో దృష్టిపెట్టలేదంటూ ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి పేర్కొంటున్నారు. ఇక పాత జిల్లాల ప్రాతిపదికన చూసుకుంటే వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ - మహబూబ్‌ నగర్‌ వంటి జిల్లాలలో సభ్యత్వం మోస్తారుగా ఉంది. దీనిని బట్టి ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరీ తీసికట్టుగా ఉన్నదన్న అంచనాకు నేతలు వచ్చారు. దక్షణ తెలంగాణపై మాత్రం పార్టీ పట్టు సడలలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలాఉండ‌గా...తాజాగా సభ్యత్వంపై కొత్త జిల్లాల కన్వీనర్లతో ఏర్పాటుచేసిన టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సీరియస్‌ వార్నింగే ఇచ్చినట్టు తెలిసింది. కన్వీనర్లుగా ఉన్నవారు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో కనీసం అయిదుశాతం సభ్యత్వం చేయకపోతే వారి పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు వినికిడి. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే ఆరేడు మంది కన్వీనర్లు తమ పదవులకు ఎసరు తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదిఏమైనా 2019 ఎన్నికలకు ఈ టీమే కీలకం కనుక డెడ్‌లైన్‌ లోపు ఎలాగైనా టార్గెట్‌ రీచ్‌ కావాలని అగ్రనేతలు ఆలోచన చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/