Begin typing your search above and press return to search.

ఏపీ నుంచి బరిలోకి కేటీఆర్..?

By:  Tupaki Desk   |   19 Jan 2017 6:28 AM GMT
ఏపీ నుంచి బరిలోకి కేటీఆర్..?
X
ఆశ్చర్యంగా అనిపించిందా? అయితే.. ఈ మాటను చెప్పింది మంత్రి కేటీఆర్ కాదు.. టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని ఆయన ఎలా చెబుతారు? అంటారా? దీనికి కారణం లేకపోలేదు. ఈ ముచ్చట అంతా తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి. వివరాలు తెలుసుకోవాలి. అప్పుడే రేవంత్ రెడ్డి ఈ మాట ఎందుకు అన్నారో క్లారిటీ వస్తుంది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డికి.. మంత్రి కేటీఆర్ కు మధ్య సంవాదం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆ చిలుక ఇక్కడిదే.. పలుకు పరాయిది అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత అయినప్పటికీ.. ఆయన మాట మాత్రం ఆంధ్రా ప్రాంతానికి చెందిన టీడీపీది అన్నది కేటీఆర్ మాట.

దీనికి ఒక రోజు ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు రేవంత్. అసెంబ్లీ లాబీల్లో మీడియా మిత్రులతో కలిసిన సందర్భంగా మాట్లాడిన రేవంత్.. తనపై చేసిన వ్యాఖ్యకు కౌంటర్ సమాధానంగా చెబుతూ.. ‘ఆ చిలుక అక్కడిదే.. పలుకూ అక్కడిదే’ అంటూ సటైర్ వేశారు. కేటీఆర్ అక్కడి (ఏపీ) వాడు ఎలా అవుతాడన్న సందేహానికి మరింత వివరంగా సమాధానం ఇస్తూ.. ‘ఆయన (కేటీఆర్ ను ఉద్దేశించి) చదువుకుంది గుంటూర్ లో. 371(డి) ప్రకారం.. ఆయనకు ఇక్కడ ఏ పోస్టూ రాదు. ఈ సంగతి ఆయనకూ తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తనన్నడు. అయితే.. గియితే నాకూ.. హరీశ్ కే ఇక్కడ ఛాన్స్ ’ అంటూ చమత్కరించారు. సభలో చురుకు వేయకున్నా.. మీడియావద్ద రేవంత్ వ్యాఖ్యలో ఎంతో కొంత నిజమన్న మాట వినిపించింది. కాకుంటే.. కేటీఆర్ వర్గీయులకు హరీశ్ ప్రస్తావనే కాస్త ఇబ్బందిగా అనిపించిందట. మొత్తానికి కేటీఆర్ స్థానికుడు కాదన్న వాదనను రేవంత్ తన మాటలతో తీసుకొచ్చినట్లే. మరి.. దీనికి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/