Begin typing your search above and press return to search.

విలీనంపై కోర్టులో అమీతుమీ?

By:  Tupaki Desk   |   13 Feb 2016 3:57 AM GMT
విలీనంపై కోర్టులో అమీతుమీ?
X
నిన్నమొన్నటి వరకూ కలిసే ఉన్న తమ్ముళ్లు ఇప్పుడు రెండు వర్గాలుగా మారారు. టీటీడీపీ ఉనికినే ప్రశ్నార్థకంగా చేయాలన్నది ఒక బ్యాచ్ ఆలోచిస్తుంటే.. మరో బ్యాచ్ ఏది ఏమైనా తమ ఆస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎంత పోరాటానికైనా రెఢీ అంటున్నారు. తాజాగా టీటీడీపీ శాసన సభాపక్ష నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి.. పార్టీని వీడిపోయిన నేతలపై చెలరేగిపోతున్నారు. ఇటీవల పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీటీడీపీ ఎమ్మెల్యేల్ని తెలంగాణ అధికారపక్షంలో విలీనం చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు.

దీనికి ప్రతిగా అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో ఇటీవల చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా పిటీషన్ ఇచ్చారు. అనంతరం టీటీడీపీ శాసనసభాపక్ష నేతగా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని విలీనం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారే తప్పించి.. ఫ్లోర్ లీడర్ కాదని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా సమావేశమై తీర్మానించి.. పార్టీ మొత్తాన్ని విలీనం చేయాలే కానీ.. శాసనసభాపక్షాన్ని మాత్రమే కాదన్న వాదనను వినిపించారు. ఈ వ్యవహారంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా విలీన అంశం కోర్టు మెట్లను తొక్కటం ఖాయంగా కనిపిస్తోంది.