Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో రేవంత్ రెబల్ ఎజెండా మొద‌లైంద‌ట‌

By:  Tupaki Desk   |   21 Nov 2017 11:30 AM GMT
కాంగ్రెస్‌ లో రేవంత్ రెబల్ ఎజెండా మొద‌లైంద‌ట‌
X
భారీ రాజ‌కీయ ల‌క్ష్యంలో భాగంగా తెలంగాణ టీడీపీకి గుడ్‌ బై చెప్పేసిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త‌న రాజ‌కీయ ఎజెండాను శ‌ర‌వేగంగా అమ‌ల్లో పెడుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే త‌న `ముద్ర‌` కోసం ప‌రిత‌పిస్తున్న రేవంత్ ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీలో అవ‌స‌ర‌మైతే పోరాట‌పంథాలో ముందుకు సాగేందుకు కూడా నిర్ణ‌యించుకున్నార‌ట‌. రాష్ట్రవ్యాప్త పాద‌యాత్ర‌పై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ఈ క్ర‌మంలో త‌న ప‌ర్య‌ట‌న‌కు స‌ర్వం సిద్ధం చేసుకున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరెంత వ్యతిరేకించినా, విబేధించినా పాదయాత్ర విషయంలో రేవంత్‌ రెడ్డి వెనక్కుతగ్గడం లేదని తెలుస్తోంది. తాను చేయాలనుకున్నది చేసి తీరతానన్న పట్టుదలతో ఉన్నార‌ని..రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు వ్యతిరేకించినా వాటిని రేవంత్‌ రెడ్డి పట్టించుకోవడం లేదని అంటున్నారు.

మొద‌టినుంచి పాద‌యాత్ర విష‌యంలో రేవంత్ స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ఉన్నార‌ని అంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ముందే పాదయాత్రతో పాటు అన్ని విషయాలు రేవంత్‌ రాహుల్‌ గాంధీకి చెప్పి, ఆయన అనుమతి తీసుకున్నారని సమాచారం. ఇటీవల ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జీ కుంతియా కలిసినప్పుడు కూడా పాదయాత్ర షెడ్యూల్‌ ను ఆయనకు వివరించినట్టు తెలిసింది. కుంతియా కూడా వ్యతిరేకించలేదు అని సమాచారం. ఇలా అధిష్టానం వ‌ద్ద త‌న ఎజెండాపై పూర్తి స్ప‌ష్ట‌త ఇచ్చిన రేవంత్ రెడ్డి మ‌రోవైపు త‌న కార్యాచ‌ర‌ణ‌ను వేగంగానే అమ‌ల్లో పెడుతున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే పాదయాత్రకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ ను సిద్ధం చేసుకుంటున్నారని ఆయ‌న సన్నిహిత వ‌ర్గాలు చెప్తున్నాయి. పాద‌యాత్ర‌ ఎన్ని రోజులు - ఎన్ని కిలోమీటర్లు - ఎన్ని నియోజకవర్గాలు - ఎన్ని గ్రామాలు తదితర అంశాలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. దీనికోసం 50 మంది టెక్నికల్‌ టీమ్‌ పనిచేస్తున్నట్టు సమాచారం.

ఈ సంద‌ర్భంగానే త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను టార్గెట్ చేసుకునే అజెండాను సిద్ధం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అధికారంలో రాకముందు టీఆర్‌ ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీలు - అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనలు అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివరాలు సిద్ధం చేసుకుంటున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే తుది అనుమ‌తి కోసం రేవంత్ ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ పట్టాభిషేకం పూర్తయిన తర్వాతే రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేస్తారని ఆయన వర్గీయులు పేర్కొన్నారు. తన పాదయాత్రకు రాహుల్‌ గాంధీ అనుమతి తప్పకుండా ఉంటుందనేది రేవంత్‌ ఆలోచనగా ఉంది.