Begin typing your search above and press return to search.

అలాంటి టాలెంట్ కేసీఆర్ ఒక్క‌డికే ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   29 April 2017 6:40 AM GMT
అలాంటి టాలెంట్ కేసీఆర్ ఒక్క‌డికే ఉంద‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఒంటికాలిపై లేచే టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మ‌రో మారు గులాబీ ద‌ళ‌ప‌తి తీరుపై నిప్పులు చెరిగారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన ప్రజాపోరు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్‌ రెడ్డి మండిప‌డ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు పండించిన పంటలను రోడ్లపాలు చేసుకోవాల్సి వస్తోందన్నారు. మొదట్లో కంది - మిర్చి పంటలు వేసుకోవాలని చెప్పిన కేసీఆర్‌ - వాటికి గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

వాక్చాతుర్యాన్ని ఆయుధంగా వాడుకుంటున్న కేసీఆర్ ఈమధ్య రైతుల పాట పాడుతున్నారని, నిన్న చెప్పిన మాట ఈరోజు చెప్పడం లేదని, అబద్దాన్ని కూడా నిజం అని నమ్మించే వాక్పటిమ ఆయనకు ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రుణమాఫీ కూడా సక్రమంగా చేయని ప్రభుత్వం ఖరీఫ్‌ కు ఎకరాకు రూ.4వేలు ఇస్తామనడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో నకిలీ విత్తన కంపెనీలను అదుపు చేయకుండానే తెలంగాణను విత్తనోత్పత్తి కేంద్రంగా మారుస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజుకో కొత్త మాటతో కాలం వెళ్లదీస్తూ ఇచ్చిన హామీలను మరిచిన సీఎంకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంటికో ఉద్యోగం - దళితులకు మూడెకరాల భూమి - డబుల్‌ బెడ్‌ రూం పథకాలు ఇప్పుడు సీఎంకు గుర్తుకు రావడం లేదన్నారు.

తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుంటాయనుకుంటే కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. తండ్రిని అడ్డ పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్‌ కు రోజులు దగ్గర పడ్డాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాండూరులో టీటీపీ పోరు యాత్రతో టీఆర్‌ ఎస్‌ లో గుబులు మొదలైందన్నారు. తాండూరులో ఇచ్చిన హామీలు మరిచిన సీఎంకు దమ్ముంటే ఇక్కడే సభ పెట్టాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం రూ.25వేల కోట్లు ప్రత్యేక బడ్జెట్‌ లో కేటాయిస్తామని చెప్పారు. టీటీడీపీ అధికారంలోకి వస్తే అయిదు ప్రధాన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. పత్తికి రూ. 8వేలు - మిర్చికి రూ. 9వేలు - మొక్కజొన్నకు రూ.1800 - పసుపుకు రూ.8వేలు - కందికి రూ.8వేలు చెల్లిస్తామన్నారు. రైతు సంక్షేమం కోసం రూ.25వేల కోట్లు కేటాయిస్తామన్నారు. రైతుకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకుండా.. అప్పులపాలయ్యాక రుణాలు మాఫీ చేస్తామనడం సరికాదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర ఉంటే అన్నదాతలు రుణమాఫీ కోసం ఎదురు చూసే పరిస్థితే రాదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం దొరల - గడీల పాలనను సీఎం కేసీఆర్‌ పునరావృతం చేస్తున్నారని విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/