Begin typing your search above and press return to search.

అమరవీరుల అడ్రస్ లు టీ సర్కారుకు తెలీదా?

By:  Tupaki Desk   |   29 May 2016 1:42 PM GMT
అమరవీరుల అడ్రస్ లు టీ సర్కారుకు తెలీదా?
X
తిరుపతిలో నిర్వహిస్తున్న మహానాడు చివరి రోజున తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కసాయిని నమ్మినట్లుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మారన్న ఆయన.. తెలంగాణ కోసం తమ ప్రాణాలు తీసుకున్న 690 మంది అమరవీరుల అడ్రస్ లు తెలీదంటూ కేసీఆర్ సర్కారు చెప్పటం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1569 మంది కుటుంబాలకు ఇల్లు.. ఉద్యోగం.. రూ.5లక్షల నగదు ఇస్తామని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటివరకూ ఆ హామీని అమలు చేయలేదన్నారు.

ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాల పట్ల టీఆర్ ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో గడిచిన రెండేళ్ల వ్యవధిలో రూ.2.5లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. అభివృద్ధి మాత్రం శూన్యమని రేవంత్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయమని చెప్పిన రేవంత్.. అబద్ధాలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారంటూ దుయ్యబట్టారు. కోటి మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు.. నిరుపేదలకు మూడు ఎకరాల భూమి హామీ ఇంకా ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించిన రేవంత్.. తన పదునైన వాదనతో కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.