Begin typing your search above and press return to search.

కొత్త స్నేహితుల‌ను వెతుక్కున్న రేవంత్‌

By:  Tupaki Desk   |   21 Jan 2017 5:01 PM GMT
కొత్త స్నేహితుల‌ను వెతుక్కున్న రేవంత్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై పోరాటం అంటే ఒంటికాలిపై లేచే టీటీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తాజాగా త‌న పోరాటంలో భాగంగా కొత్త కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. రాష్ట్రంలో అధికార పక్షం వైఫల్యాలపై నిలదీయాల్సిన విపక్షాలు అందుకు సంసిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌క‌పోవడంతో రేవంత్ రెడ్డి కొత్త మిత్రుల‌ను వెతుక్కున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనపడి తమ పాత్రను పోషించడంలో విఫలమైనందున త్వ‌ర‌లో మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాల‌ను క‌లిసి ప్ర‌భుత్వ వ్య‌తిరేక పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా కోర‌నున్న‌ట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేసీఆర్ అనుకూల వ‌ర్గం - వ్యతిరేక వర్గంగా చీలిపోయిందని రేవంత్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను మరగబెడుతున్న కేసీఆర్‌ నిలదీయాల్సిన బీజేపీ కూడా కేసీఆర్ వేలు పట్టుకుని నడుస్తున్నట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎంఐఎం అయితే పూర్తిగా స‌రెండ‌ర్ అయిపోయిన ప‌రిస్థితి ఉంద‌న్నారు. కేసీఆర్ ఒక చేత్తో బీజేపీని - మరో చేతితో ఎంఐఎంను పట్టుకుని నడుస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇతర విపక్షాలు ఈ విధంగా ప్రజల పక్షాన పోరాడటంలో విఫలమైన నేపథ్యంలో పేద ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ మాత్రమే పోరాటాలు చేయడానికి సిద్ధమవుతోందన్నారు. ఈ క్ర‌మంలోనే మీడియా సంస్థల అధినేతలందరినీ కలిసి ప్రజా సమస్యలపై పోరాటానికి వారి మద్దతును కూడా కోరడం జరుగుతుందని రేవంత్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనపడి తమ పాత్రను పోషించడంలో విఫలమైనప్పుడు పాత్రికేయులే ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి ఉంటుందని ఆయన పునరుద్దాటించారు. కాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మే 29న ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని కూడా నిర్ణయించామన్నారు. ఈ సభ ద్వారా గతంలో టీడీపీ తెలంగాణకు చేసిన మేలును వివరించడంతోపాటు ఆనాటి పరిస్థితులను బేరిజు చేసూ టీడీపీ బడుగు - బలహీన వర్గాలకు ఎదిగే అవకాశాలను ఏ విధంగా ఇచ్చిందన్న విషయంగా కొత్త తరానికి అవగాహన కల్పించడం జరుగుతుందని రేవంత్ రెడ్డి వివరించారు.

టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడంలోనూ, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడంలోనూ, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమిని, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను, ఎస్టీలు, మైనారిటీలు, వికలాంగులకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జనరంజకమైన ఏ హామీని కూడా టీఆర్ఎస్ అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. అందుకే ప్ర‌భుత్వంపై ప్ర‌జాక్షేత్రంలో పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు రేవంత్ రెడ్డి వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/