Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లను నెత్తికెక్కించుకుంటున్నారన్న రేవంత్

By:  Tupaki Desk   |   21 Feb 2017 9:04 AM GMT
ఆంధ్రోళ్లను నెత్తికెక్కించుకుంటున్నారన్న రేవంత్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్న తరుణంలో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి చెందిన వ్యక్తులకు కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని.. తెలంగాణకు బ్రాండు అంబాసిడర్లుగా ఆంధ్రోళ్లను నియమించుకుంటున్నారని ఆరోపించారు. ఏపీకి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిని కేసీఆర్ ఫుల్లుగా వాడుకుంటున్నారని.. హిందూత్వ ప్రచారం కోసం చినజీయర్ ను... తెలంగాణ చేనేతకు ప్రచారానికి గాను సినీ నటి సమంతను ఉపయోగిస్తున్నారని రేవంత్ విమర్శించారు.

ఏపీకి చెందిన చినజీయర్ ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడాన్ని ఆయన ప్రశ్నించారు. యాదగిరి గుట్ట అభివృద్ధి పనుల విషయంలో ఆయనకు అధికారాలు ఎలా ఇస్తారని నిలదీశారు. యాదగిరి గుట్టకు జీయర్ స్వామి యాదాద్రి అని పేరు పెట్టారని.. కానీ, యాదాద్రి అనేది ఆంధ్ర నుంచి వచ్చిన పదమని ఆయన అన్నారు. అంతేకాదు.. యాదాద్రి అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్న ప్రముఖ ఆర్ట్ డైరెక్టరు ఆనంద్ సాయి కూడా ఆంధ్ర వ్యక్తని.. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడని చెబుతూ రేవంత్ అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

మరవైపు సినీ నటి సమంతను తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. సమంత తెలంగాణకు నాన్ లోకల్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారులు, బ్రాండ్ అంబాసిడర్లుగా ఆంధ్రోళ్లను, నాన్ లోకల్స్ ని నియమించడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/